
Pranay Case Judgement: ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు.. ఒకరికి ఉరిశిక్ష, ఆరుగురికి జీవితఖైదు
ఈ వార్తాకథనం ఏంటి
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 2018లో సంచలనంగా మారిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ కోర్టు బుధవారం కీలక తీర్పు వెల్లడించింది.
ఈ కేసులో ఏ-2 నిందితుడు శుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది.
మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్లు పాఠశాల రోజుల నుంచే ప్రేమించుకుని, 2018లో కులాంతర వివాహం చేసుకున్నారు.
అయితే తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో, అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్ను ఏర్పాటు చేసి, 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను అత్యంత క్రూరంగా హత్య చేయించాడు.
ఈ ఘటన అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
Details
ప్రధాన నిందితుడు ఆత్మహత్య
ఈ హత్యపై ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు, మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు ఎనిమిది మందిపై 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు.
2019 జూన్ 12న 1600 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 5 సంవత్సరాలు 9 నెలల పాటు విచారణ కొనసాగిన అనంతరం, న్యాయస్థానం సాక్ష్యాలు, పోస్టుమార్టం నివేదికలు, సైంటిఫిక్ ఎవిడెన్స్లను పరిశీలించి తుది తీర్పును వెలువరించింది.
అయితే, ఈ కేసు విచారణ సమయంలోనే ప్రధాన నిందితుడు మారుతీరావు తీవ్ర డిప్రెషన్కు గురై, 2020 మార్చిలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.