Andhra Pradesh: భానుడి భగభగలు.. నేడు 73 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. భానుడి ప్రభావంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. శనివారం 73మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 17 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం పరిస్థితి కూడా అలాగే కొనసాగనుందని, 32 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని వెల్లడించారు. విజయనగరం జిల్లాలో 24 మండలాలు, శ్రీకాకుళం జిల్లాలో 16, పార్వతీపురం మన్యం జిల్లాలో 15, పోలవరం ప్రాంతంలో 9, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 3, అనకాపల్లి జిల్లాలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 1 మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇక శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో గరిష్టంగా 41.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. చిత్తూరు జిల్లా రాయలపేటలో 41.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 40.9 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా జి.సిగడాంలో 40.5 డిగ్రీలు నమోదయ్యాయి. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆలమూరు, వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో 40.4 డిగ్రీలు, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెం, తిరుపతి జిల్లా రేణిగుంట, విజయనగరం జిల్లా రాజాంలలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.