Sikkim: మీథేన్ వాయువు పేలుడే కారణం.. సిక్కిం సొరంగ దుర్ఘటనలో 20 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
సిక్కింలో నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 25 మందిలో ఇప్పటివరకు 20 మంది మృతిచెందినట్లు అధికారులు మంగళవారం అధికారికంగా ప్రకటించారు. మరో ఐదుగురి కోసం సహాయక బృందాలు యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ, వారు సురక్షితంగా బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామ్చీ జిల్లాలోని సమర్దుంగ్ ప్రాంతంలో ఎన్హెచ్పీసీ చేపడుతున్న తీస్తా స్టేజ్-6 హైడ్రోపవర్ ప్రాజెక్టుకు సంబంధించిన సొరంగ నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో సోమవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొలుత కొండచరియలు విరిగిపడటంతోనే సొరంగం కూలిపోయిందని భావించినప్పటికీ, అనంతర దర్యాప్తులో అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
వివరాలు
సొరంగంలో కార్మికులు,పలువురు అధికారులు
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ వెల్లడించిన వివరాల ప్రకారం,రాళ్లలో చిక్కుకుపోయిన మీథేన్ వాయువు ఒక్కసారిగా అధిక ఒత్తిడితో బయటకు రావడంతో భారీ పేలుడు సంభవించింది.
ఆ పేలుడు ప్రభావంతో సొరంగం కూలిపోగా,అనంతరం విషపూరిత వాయువులు వ్యాపించాయి.
దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులతో పాటు ప్రాజెక్టుకు చెందిన పలువురు అధికారులు కూడా సొరంగంలో చిక్కుకుపోయారని ఆయన తెలిపారు.
వివరాలు
రాళ్లలోని మీథేన్ గ్యాస్ వల్ల పేలుడు
ఈ ఘటనపై ఎన్హెచ్పీసీ కూడా ప్రకటన విడుదల చేసింది.
రాళ్లలోని మీథేన్ గ్యాస్ ఆకస్మికంగా బయటకు రావడం వల్ల పేలుడు సంభవించిందని, ఆ తర్వాత విష వాయువులు వ్యాపించడం పరిస్థితిని మరింత విషమం చేసిందని సంస్థ వెల్లడించింది.
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
అదనంగా సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించింది.