CJP: సోనమ్కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తెలిపింది. వాంగ్చుక్కు ఏదైనా జరిగితే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి ఆశుతోష్ రాంకా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే వెల్లడించిన వివరాల ప్రకారం, నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకోగా వాంగ్చుక్ రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయికి కంటే తగ్గి 66కు చేరిందని తెలిపారు. దీంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
వివరాలు
నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించిన వాంగ్చుక్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పోటీ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న అక్రమాలపై బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ వాంగ్చుక్ ఆదివారం నుంచి జంతర్మంతర్ వద్ద జరుగుతున్న సీజేపీ ఆందోళనలో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జూన్ 20న ప్రారంభమైన ఈ ఆందోళన తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీక్ తదితర పరీక్షల వివాదాలపై కేంద్రీకృతమైనప్పటికీ, ఇప్పుడు విద్యా వ్యవస్థతో పాటు ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల ప్రక్రియలో జవాబుదారీతనం వంటి విస్తృత అంశాలపై కూడా సాగుతుందని అభిజీత్ దీప్కే తెలిపారు.
వివరాలు
సత్యం,శాంతి నా మార్గం. న్యాయం నా లక్ష్యం: వాంగ్చుక్
తాను ఈ ఉద్యమంలో చేరడానికి కారణం వివరిస్తూ వాంగ్చుక్ మాట్లాడుతూ,గత నాలుగు దశాబ్దాలుగా విద్య తన జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశమని,విద్యార్థులు వ్యవస్థపై ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు మౌనంగా ఉండలేనని అన్నారు. "విద్య,పర్యావరణం నా ప్రధాన అంశాలు. సత్యం,శాంతి నా మార్గం. న్యాయం నా లక్ష్యం" అని ఆయన పేర్కొన్నారు. గత ఐదు నుంచి ఆరు సంవత్సరాలుగా లడఖ్ పర్యావరణ పరిరక్షణ,అక్కడి సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు ఉద్యమం చేస్తున్నానని వాంగ్చుక్ తెలిపారు. విద్యా రంగంతో పాటు పర్యావరణ పరిరక్షణలో కూడా మరింత జవాబుదారీతనం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లేకపోతే చర్చలు కూడా ఫలితం ఇవ్వవని, అలాంటి పరిస్థితుల్లో శాంతియుత నిరసన మాత్రమే ప్రజలకు మిగిలే మార్గమని వాంగ్చుక్ అన్నారు.
వివరాలు
ఉద్యమం ఏ ఒక్క వ్యక్తి చుట్టూ తిరగకూడదు: అభిజీత్ దీప్కే
ప్రభుత్వం ప్రజల ఆందోళనలను ముందుగానే పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇప్పటికైనా సున్నితంగా స్పందించాలని ఆయన కోరారు. లడఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్తో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన నేపథ్యంలో వాంగ్చుక్ను గతంలో జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద అరెస్టు చేశారు. అనంతరం అధికారులు ఎన్ఎస్ఏను ఉపసంహరించుకోవడంతో దాదాపు ఆరు నెలల నిర్బంధం తర్వాత 2026 మార్చిలో జోధ్పూర్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. ఇదిలా ఉండగా, ఉద్యమం ఏ ఒక్క వ్యక్తి చుట్టూ తిరగకూడదని అభిజీత్ దీప్కే పిలుపునిచ్చారు. కొందరు తనకు మద్దతుగా నినాదాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ, సమస్య కంటే ఎవరినీ పెద్దవారిగా చూడొద్దని, అసలు లక్ష్యం ప్రజా సమస్యల పరిష్కారమే కావాలని సూచించారు.
వివరాలు
నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు మహాత్మా గాంధీకి నివాళులర్పించిన వాంగ్చుక్, అభిజీత్ దీప్కే
ఈ ఆందోళనకు విద్యార్థులు, పౌరసమాజ ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సాయంత్రానికి వేలాది మంది జంతర్మంతర్కు చేరుకున్నారు. నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభానికి ముందు వాంగ్చుక్, అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించి ఆందోళనను ప్రారంభించారు. తీవ్రమైన ఎండలను తట్టుకుని ఉద్యమాన్ని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరినీ వాంగ్చుక్ అభినందించారు. ఈ పోరాటాన్ని ప్రజల ఉద్యమంగా మార్చాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక రోజు నిరాహార దీక్షలో పాల్గొని మద్దతు తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు.