Page Loader
సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి 94 ప్రత్యేక రైళ్లను నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

వ్రాసిన వారు Stalin
Dec 28, 2022
02:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతికి ఊళ్లకు వెళ్లాలనుకునే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ట్రెయిన్స్ నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని.. సకాలంలో వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అదనంగా 94రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి చాలా పెద్ద పడంగ కాబట్టి.. అందుకు తగ్గట్టుగానే ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేసినట్లు రైల్వేశాఖ చెప్పింది. ఈ ప్రత్యేక రైళ్లను జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

సంక్రాంతి

ఐఆర్‌సీ‌టీసీ వెబ్‌సైట్‌లో బుకింగ్

సంక్రాంతి కోసం ప్రత్యేకంగా నడిపే 94 రైళ్లను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్యే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని గమ్యస్థానాలకు నడపనున్నారు. ప్రత్యేక రైళ్లలో రిజర్వడ్ బోగీలు, అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఉంటాయి. అయితే ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలనుకునే వారు పీఆర్ఎస్ కౌంటర్లు లేదా.. ఐఆర్‌సీ‌టీసీ వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవాలని రైల్వే శాఖ చెప్పింది. అన్‌రిజర్వ్‌డ్ ప్రయాణికులు మాత్రం తమ టికెన్‌‌ను మొబైల్ యాప్‌లోని యూటీఎస్ ద్వారా తీసుకోవాలని సూచించింది. మొబైల్ యాప్‌లో టికెట్ తీసుకోవడం ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద క్యూను నివారించవచ్చని పేర్కొంది. ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేసింది.