LOADING...
South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం
దశాబ్దాల కల సాకారం

South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
08:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. విశాఖపట్టణం కేంద్రంగా సోమవారం నుంచి జోన్‌ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమవుతున్నాయి. నగరంలోని వీఎంఆర్‌డీఏ డెక్‌ భవనంలో తాత్కాలిక జోనల్‌ కార్యాలయాన్ని సిద్ధం చేసిన అధికారులు, అక్కడి నుంచే పరిపాలనా వ్యవహారాలను నిర్వహించనున్నారు. మెకానికల్‌,టెలికమ్యూనికేషన్‌,సివిల్‌,ప్రధాన పరిపాలన విభాగాల పనులతో పాటు ఇతర కీలక కార్యకలాపాలన్నీ ఈ కార్యాలయం నుంచే సాగనున్నాయి. జోన్‌కు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ అధికారిని కూడా నియమించారు. కొత్త జోన్‌ పరిధిలో ప్రస్తుతం గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు విశాఖపట్నం డివిజన్‌ కలిపి మొత్తం నాలుగు డివిజన్లు పనిచేయనున్నాయి. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 130 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్‌కు ముగింపు పలికారు.

వివరాలు 

నిరాడంబరంగా

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ దేశంలోని 18వ రైల్వే జోన్‌గా గుర్తింపు పొందనుంది. ఈ సందర్భంగా జోన్‌ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ సోమవారం గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్ల అధికారులతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం. అనంతరం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమై జోన్‌కు సంబంధించిన కీలక అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు. జోన్‌ ప్రారంభంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నప్పటికీ, తాత్కాలిక కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు ఈ చారిత్రక ఘట్టాన్ని పండుగలా జరుపుకోవాలని భావించినప్పటికీ, అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

వివరాలు 

గతంలో జాప్యం.. ఇప్పుడు వేగం

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ప్రధాన కార్యాలయం, ఇతర భవనాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం 2020-21 బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించింది. విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో 53ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. 2019 ఫిబ్రవరిలో కేంద్రం జోన్‌ ఏర్పాటును ప్రకటించినప్పటికీ,ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేయలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా భూముల కేటాయింపులో జాప్యం చోటుచేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల అప్పగింత పూర్తి చేసి,జోన్‌ ఏర్పాటుకు వేగం తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 28న విశాఖలో గూగుల్‌ డేటా సెంటర్‌ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ జోన్‌ కార్యకలాపాలు త్వరలోనే ప్రారంభమవుతాయని ప్రకటించారు.

Advertisement

వివరాలు 

రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చడంలో కీలకం: ముఖ్యమంత్రి చంద్రబాబు

అనంతరం మే 5న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జోన్‌ ప్రారంభాన్ని చారిత్రక మైలురాయిగా అభివర్ణించిన ఆయన, ఏపీ ప్రజల దీర్ఘకాల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్త రైల్వేజోన్‌ ఉత్తరాంధ్ర రవాణా రంగానికి కొత్త రూపును తీసుకురావడమే కాకుండా, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ: మంత్రి శ్రీబాల వీరాంజనేయస్వామి

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఆవిర్భావం ఆంధ్రుల దశాబ్దాల కల అని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు. రాష్ట్ర చరిత్రలో జూన్‌ 1 ప్రత్యేక రోజుగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. రైల్వే మౌలిక వసతుల విస్తరణ, కొత్త రైళ్ల ప్రవేశం, పెండింగ్‌ ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు ఈ జోన్‌ దోహదం చేస్తుందని చెప్పారు. యువతకు మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివరాలు 

ఉత్తరాంధ్రుల కల నెరవేరింది: మంత్రి సత్యకుమార్

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారమైందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. జోన్‌ కార్యకలాపాల ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.

Advertisement