LOADING...
IMD: బలహీనపడిన రుతుపవనాలు.. మహారాష్ట్రలో వర్షాలపై ఐఎండీ తాజా హెచ్చరిక
బలహీనపడిన రుతుపవనాలు.. మహారాష్ట్రలో వర్షాలపై ఐఎండీ తాజా హెచ్చరిక

IMD: బలహీనపడిన రుతుపవనాలు.. మహారాష్ట్రలో వర్షాలపై ఐఎండీ తాజా హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
10:24 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మహారాష్ట్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాల విస్తరణ గత కొన్ని రోజులుగా నిలిచిపోయిందని వెల్లడించింది. ఇందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు లేకపోవడమే ప్రధాన కారణమని తెలిపింది. ఐఎండీ ముంబై వివరాల ప్రకారం, జూన్ 8న దక్షిణ కొంకణ్, దక్షిణ మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అయితే ఆ తర్వాత వాటి పురోగతి ముందుకు సాగలేదు. సాధారణంగా అరేబియా సముద్రం నుంచి బలమైన తేమతో కూడిన గాలులు వీచడం వల్ల రుతుపవనాలు వేగంగా విస్తరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదని వాతావరణ శాఖ పేర్కొంది.

వివరాలు 

తగ్గిన క్రాస్ ఈక్వటోరియల్ గాలుల ప్రభావం

రుతుపవనాలకు అనుకూలంగా ఉండే దిగువస్థాయి నైరుతి గాలులు బలహీనపడటంతో మహారాష్ట్ర తీరం, లోతట్టు ప్రాంతాలకు తేమ సరఫరా తగ్గిందని వెల్లడించింది. అలాగే పశ్చిమ హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం మీదుగా వచ్చే క్రాస్ ఈక్వటోరియల్ గాలుల ప్రభావం కూడా ఇటీవల తగ్గిపోయిందని ఐఎండీ తెలిపింది. ఈ గాలులే నైరుతి రుతుపవనాలకు అవసరమైన తేమను అందిస్తాయని, అవి బలహీనపడటంతో వర్షాల కార్యకలాపాలు కూడా తగ్గాయని వివరించింది. ఇక అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనాలు లేదా ఉపరితల ఆవర్తనాలు వంటి కీలక వాతావరణ వ్యవస్థలు లేకపోవడం, పశ్చిమ తీరంలో బలమైన ఆఫ్‌షోర్ ట్రఫ్ ఏర్పడకపోవడం కూడా రుతుపవనాల పురోగతికి ఆటంకంగా మారిందని తెలిపింది.

వివరాలు 

రాష్ట్రంలో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం

మాడెన్-జూలియన్ ఆసిలేషన్ (ఎంజేఓ) వంటి భారీ వాతావరణ చక్రాలు కూడా ప్రస్తుతం మహారాష్ట్రలో రుతుపవనాల విస్తరణకు అనుకూల సంకేతాలు ఇవ్వడం లేదని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. అయితే జూన్ 24, 25 తేదీల్లో కొంకణ్ ప్రాంతంలో వర్షాల తీవ్రత పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాల మరింత పురోగతికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయేమోనని నిరంతరం పరిశీలిస్తున్నామని, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement