Bhawana Kanth: వాయుసేనలో చరిత్ర సృష్టించిన భావనా కాంత్.. తొలి మహిళా 'టాప్ గన్' పైలట్గా అరుదైన ఘనత
ఈ వార్తాకథనం ఏంటి
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఫైటర్ కంబాట్ లీడర్ (ఎఫ్సీఎల్) కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన తొలి మహిళా ఫైటర్ పైలట్గా చరిత్ర సృష్టించారు. వాయుసేనలో ఈ శిక్షణను 'టాప్ గన్' ప్రోగ్రామ్గా పరిగణిస్తారు. ఈ కోర్సు పూర్తి చేయడంతో అత్యంత క్లిష్టమైన వైమానిక యుద్ధ ఆపరేషన్లకు నాయకత్వం వహించే అర్హతను భావనా కాంత్ పొందారు.
వివరాలు
అత్యుత్తమ పైలట్లకే 'టాప్ గన్' శిక్షణ
గ్వాలియర్లోని టాక్టిక్స్ అండ్ ఎయిర్ కంబాట్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (టీఏసీడీఈ)లో ఈ ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తారు.
అమెరికా నేవీ నిర్వహించే ప్రసిద్ధ 'టాప్ గన్' స్కూల్కు సమానమైన స్థాయిలో ఈ కోర్సుకు గుర్తింపు ఉంది. 20 వారాలపాటు సాగే ఈ శిక్షణలో ఆధునిక వైమానిక యుద్ధ వ్యూహాలు, మిషన్ ప్రణాళిక, గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూమిపై దాడుల వ్యూహాలు, క్లిష్ట పరిస్థితుల్లో నాయకత్వ సామర్థ్యం వంటి అంశాల్లో అత్యున్నత స్థాయి శిక్షణ అందిస్తారు.
వాయుసేనలోని అత్యుత్తమ ఫైటర్ పైలట్లలో కొద్దిమందికి మాత్రమే ఈ కోర్సులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిని 'టాప్ గన్' పైలట్లుగా గుర్తిస్తారు.
వివరాలు
భావనా కాంత్ ప్రస్థానం..
బిహార్లోని దర్భంగా జిల్లాకు చెందిన భావనా కాంత్ ఇంజినీరింగ్ పట్టభద్రురాలు.
2016 జూన్లో భారత వాయుసేనలో నియమితులైన తొలి మహిళా ఫైటర్ పైలట్ల బ్యాచ్లో ఆమె ఒకరు.
అవనీ చతుర్వేది, మోహనా సింగ్లతో కలిసి ఆమె కమిషన్ పొందారు. 2019లో పగటి వేళల్లో యుద్ధ విమానాన్ని నడిపిన తొలి మహిళా పైలట్గా మరో గుర్తింపును సొంతం చేసుకున్నారు.
ప్రారంభంలో మిగ్-21 బైసన్ యుద్ధ విమానాన్ని నడిపిన భావనా, అనంతరం అత్యాధునిక సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ను నడిపే బాధ్యతలు చేపట్టారు.
2021 గణతంత్ర దినోత్సవ పరేడ్తో పాటు 2024లో జరిగిన ఫ్లైపాస్ట్లో కూడా ఆమె పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు.
వివరాలు
మహిళా సాధికారతకు భావనా కాంత్ విజయం నిదర్శనం
భావనా కాంత్ సాధించిన తాజా ఘనత భారత వాయుసేనలో మహిళలు పోరాట, నాయకత్వ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.
సాయుధ దళాల్లో మహిళలకు మరింత అవకాశాలు కల్పించే దిశగా,లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే కీలక ముందడుగుగా ఈ విజయాన్ని రక్షణ రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు.