Sridhar Vembu: తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చింది. ఈ నేపథ్యంలో జోహో సంస్థ సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు కీలక అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రపతి పాలన విధించి, అనంతరం మళ్లీ ఎన్నికలు నిర్వహించడం సముచితమని ఆయన సూచించారు. ఈ అభిప్రాయాలను ఆయన సామాజిక మాధ్యమ వేదికలో పంచుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరిపడ సంఖ్యా బలం కనిపించడం లేదని, ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైనా అది ఒత్తిళ్లు, అంతర్గత విభేదాల కారణంగా స్థిరంగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
బీజేపీ స్వతంత్రంగా పోటీ చేయాలి
తమిళనాడు ప్రజలు మెరుగైన పరిపాలనకు అర్హులని,అందుకే పారదర్శకమైన విధానంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించడం ఉత్తమమని పేర్కొన్నారు. ఈసారి ఓటుకు డబ్బు ప్రభావాన్ని పూర్తిగా అరికట్టేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అలా జరిగితే ప్రజల నిజమైన తీర్పు ఏ దిశగా ఉందో స్పష్టమవుతుందని ఆయన చెప్పారు. అదే సమయంలో విజయ్ భారీ మెజార్టీతో తిరిగి గెలిచే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ డీఎంకే,అన్నాడీఎంకే పార్టీలు దీనిని అడ్డుకోవాలనుకుంటే,అవి కలిసే పోటీకి దిగవచ్చని సూచించారు. ఇక బీజేపీ మాత్రం స్వతంత్రంగా పోటీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ పార్టీకి ఒక్క స్థానమూ రాకపోయినా,అది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఆరంభానికి దారి తీస్తుందని తెలిపారు. ప్రజలకు మరోసారి కొత్త నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు టీవీకే పార్టీ ప్రయత్నాలు
ఇక గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన 118 స్థానాల మెజార్టీని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో తన సంఖ్యా బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ప్రకటించింది. అయినప్పటికీ విజయ్ సంఖ్యా బలం పట్ల గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.