
Vijay rally stampede: విజయ్ ర్యాలీలో తొక్కిసలాట.. కారణాలను వెల్లడించిన డీజీపీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళ సినీ స్టార్ తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన రోడ్షోలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ భారీ సంఘటనకు పోలీసులు నిర్లక్ష్యమే కారణమని విమర్శలు వస్తున్నాయి. తమిళనాడు డీజీపీ జి. వెంకటరామన్ వివరించినట్టు, సభకు పది వేల మంది మాత్రమే రావాలని నిర్వాహకులు ఊహించగా, నిజానికి దాదాపు 27,000 మంది వచ్చారు. ర్యాలీ నిర్వహణ కోసం 500 మంది సిబ్బంది కేటాయించబడ్డారని తెలిపారు.
Details
ఆలస్యంగా వచ్చిన విజయ్
విజయ్ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అనుమతి కోరారని, కానీ TVK ట్విటర్ ఖాతాలో విజయ్ 12 గంటలకు రాబోతున్నారని వెల్లడించారని చెప్పారు. జనాలు ఉదయం 11 గంటల నుంచే చేరడం ప్రారంభించారని, విజయ్ చివరకు సాయంత్రం 7:40 గంటలకు మాత్రమే సభకు వచ్చినట్లు తెలిపారు. అంత సమయం మొత్తం ఎండలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు అందకపోవడం భయంకర పరిస్థితి నెలకొందని డీజీపీ అన్నారు. కొంతమంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం జన సమూహాన్ని పెంచడానికి విజయ్ కరూర్ సభకు ఆలస్యంగా వచ్చినట్టు భావిస్తున్నారు.
Details
దేశవ్యాప్తంగా అగ్రనేతలు దిగ్భ్రాంతి
ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించమని ఆదేశించారు. రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిషన్ సంఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది. ఈ విషాద ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు అగ్రనేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.