Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ప్రభుత్వ కాలంలో బయటపడిన మద్యం స్కామ్పై విచారణ వేగం పెరిగింది. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నవారి ఆస్తులను ప్రభుత్వం వరుసగా స్వాధీనం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో వైకాపా నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల జప్తుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. భాస్కర్రెడ్డి, మోహిత్రెడ్డి, హర్షిత్రెడ్డి పేర్లపై నమోదైన ఆస్తులతో పాటు కేవీఎస్ ఇన్ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరులో ఉన్న ఆస్తులను కూడా స్వాధీనం చేసేందుకు ఆదేశాలు జారీ అయ్యాయి.
వివరాలు
ఉత్తర్వులు విడుదల చేసిన హోంశాఖ ప్రధాన కార్యదర్శి
చెవిరెడ్డి కుటుంబం కమీషన్లు,అక్రమ లావాదేవీల ద్వారా భారీగా సంపాదించిందని సిట్ దర్యాప్తులో తేలింది. మొత్తం రూ.54.87 కోట్ల నల్లధనాన్ని చట్టబద్ధం చేసినట్లు సిట్ నిర్ధారించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పలు ప్రాపర్టీలను జప్తు చేయాలని నిర్ణయించింది. అధికార ప్రభావంతో అనేక మోసపూరిత భూమి లావాదేవీలు జరిపినట్లు కూడా సిట్ స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టాలు, క్రిమినల్ లా సెక్షన్ల ప్రకారం ఆస్తుల స్వాధీనానికి అనుమతి ఇవ్వాలని నివేదికలో సూచించింది. సిట్ సూచనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు అధికారిక ఆదేశాలు ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు పంపింది. ఈ మేరకు హోంశాఖ ప్రధాన కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు విడుదల చేశారు.