Telangana: డిగ్రీ విద్యలో ఏఐ ట్యూటర్ల ప్రవేశానికి ఉన్నత విద్యామండలి ప్రణాళిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని డిగ్రీ స్థాయి విద్యలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్లను ప్రవేశపెట్టే దిశగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆలోచిస్తోంది. ఈ లక్ష్యంతో ప్రత్యేకంగా ఒక యాప్ను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనతో ఇటీవల ఐఐటీ మద్రాస్ కేంద్రంగా ఏర్పడిన ఓ స్టార్టప్ సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇదిలా ఉండగా, 2026-27 విద్యా సంవత్సరంలో బీఏ డిఫెన్స్, బీకాం ఫిన్టెక్, బీబీఏ ఏరోస్పేస్ మేనేజ్మెంట్ వంటి అనేక కొత్త కోర్సులను ప్రారంభించాలని ఉన్నత విద్యామండలి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త కోర్సులకు అవసరమైన పూర్తి స్థాయి అధ్యాపకులు అందుబాటులో లేకపోవచ్చనే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని,ఆ లోటును కొంత మేర భర్తీ చేసే మార్గాలపై మండలి దృష్టి పెట్టింది.
వివరాలు
ఏఐ ట్యూటర్ల వినియోగంపై ప్రతిపాదన
ఈ నేపథ్యంలోనే ఏఐ ట్యూటర్ల వినియోగంపై ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ విషయమై విద్యామండలి ఛైర్మన్ ఆచార్య వి. బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 120 స్టార్టప్ సంస్థలు విద్యా రంగంలో ఏఐ వినియోగంపై పనిచేస్తున్నాయని తెలిపారు. డిగ్రీ కోర్సుల్లో ఏఐ అనుసంధానంపై సమగ్రంగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.