Hyderabad: పీవీ ఎక్స్ప్రెస్వేపై ప్రమాదాలు తగ్గడానికి చర్యలు.. ఇక ప్రయాణికులు రిలాక్స్ కావొచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫ్లైఓవర్లలో పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్వే ఒకటి. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో ఈ ఎక్స్ప్రెస్వేపై ప్రమాదాలు తరచుగా చోటుచేసుకుంటుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలను తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎక్స్ప్రెస్వేపై ఉన్న ర్యాంపుల వద్ద కొన్ని మార్పులు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పనుల కోసం ఈ-ప్రొక్యూర్మెంట్ విధానంలో టెండర్లు ఆహ్వానించనుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఎక్స్ప్రెస్వేలో కొన్ని చోట్ల గుంతలు ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు. ఈ గోతుల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
Details
ప్రయాణికులకు మరింత సురక్షిత ప్రయాణాన్ని అందించడమే లక్ష్యం
అదేవిధంగా, కొందరు వాహనదారులు నిబంధనలను అతిక్రమించి అతివేగంగా ప్రయాణించడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఫ్లైఓవర్పై స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్ణయించింది. గుంతలు పూడ్చడం, ర్యాంపుల వద్ద మార్పులు చేయడం, స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టడం ద్వారా ప్రయాణికులకు మరింత సురక్షిత ప్రయాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇక ఇదే కాకుండా నగరంలోని మరికొన్ని ఫ్లైఓవర్లకు కూడా మరమ్మత్తులు చేపట్టాలని HMDA యోచిస్తోంది. వీటి కోసం కూడా టెండర్లు పిలవనుంది. అదనంగా, బుద్వేల్ లేఅవుట్ వద్ద నుంచి ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ను రేడియల్ రోడ్-2తో కలుపుతూ నిర్మిస్తున్న ఇంటర్చేంజ్ పనుల కోసం కన్సల్టెన్సీలకు టెండర్లు ఆహ్వానించినట్లు సమాచారం.