INSV Kaundinya: 1400 కిలోమీటర్లు.. 18 రోజులు.. మస్కట్ చేరిన 'INSV కౌండిన్య'..
ఈ వార్తాకథనం ఏంటి
నౌకాయాన రంగంలో భారత్ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గుజరాత్లోని పోరుబందర్ నుంచి ఇటీవల ప్రయాణం ప్రారంభించిన 'ఐఎన్ఎస్వీ కౌండిన్య' (INSV Kaundinya) బుధవారం ఒమన్ రాజధాని మస్కట్కు సురక్షితంగా చేరుకుంది. ఎలాంటి ఇంజిన్ సహాయం లేకుండా, పూర్తిగా తెరచాపల ఆధారంగా సముద్ర ప్రయాణం సాగించి తన లక్ష్యాన్ని సాధించింది. సుమారు 1400 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజుల్లో పూర్తిచేసిన ఈ నౌక మస్కట్కు చేరుకున్న వెంటనే అందులోని సిబ్బంది ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
వివరాలు
తయారీలో పూర్తిగా పురాతన నౌక నిర్మాణ పద్ధతులనే అనుసరించారు
అజంతా గుహల్లో కనిపించే ఐదో శతాబ్దానికి చెందిన ఓ పురాతన చిత్రంలోని నౌక నుంచి స్ఫూర్తి పొంది, భారతదేశానికి చెందిన ఆధునిక నిపుణులు 'ఐఎన్ఎస్వీ కౌండిన్య'ను రూపకల్పన చేసి నిర్మించారు. దీని తయారీలో పూర్తిగా పురాతన నౌక నిర్మాణ పద్ధతులనే అనుసరించారు. ఎక్కడా లోహాలు లేదా మేకులు వాడకుండా, చెక్కతోనే నిర్మాణం చేపట్టారు. చెక్క భాగాలను కొబ్బరి పీచుతో తయారుచేసిన తాళ్లతో బిగించారు. ఈ ప్రత్యేక విధానం కారణంగా దీనిని 'స్టిచ్డ్ షిప్'గా పిలుస్తున్నారు. సముద్రంలోని ఉప్పునీటి ప్రభావం నుంచి రక్షణ కోసం నౌకకు సహజసిద్ధమైన జిగురుపూతను కూడా పూశారు.