Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. అస్సాం రైఫిల్స్ శిబిరంపై రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు
ఈ వార్తాకథనం ఏంటి
మణిపూర్లోని సెనాపతి జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సెనాపతి పట్టణంలోని అస్సాం రైఫిల్స్ శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని పెద్ద సంఖ్యలో గుమిగూడిన ప్రజలు రాళ్లు రువ్వడంతో పాటు అగ్నిప్రమాదాలకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాల వాహనాలు ధ్వంసం కాగా, ఒక వాహనానికి నిప్పంటించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భద్రతా సిబ్బంది బ్లాంక్ రౌండ్లు కాల్చడంతో పాటు టియర్గ్యాస్ షెల్లు ప్రయోగించారు. రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ఎస్సీఎన్(ఐఎం)కు చెందిన సాయుధ సభ్యులు మకుయిలాంగ్డి ప్రాంతంలో ఉన్నారన్న విశ్వసనీయ సమాచారంతో అస్సాం రైఫిల్స్ మంగళవారం ఏరియా డామినేషన్ పెట్రోలింగ్, గాలింపు చర్యలు చేపట్టింది.
వివరాలు
కాల్పుల విరమణ నిబంధనల ఉల్లంఘన?
ఈ ప్రాంతం ఓక్లాంగ్లోని ఎన్ఎస్సీఎన్(ఐఎం)కు కేటాయించిన శిబిరానికి పశ్చిమంగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఎన్ఎస్సీఎన్(ఐఎం) 1997 నుంచి కేంద్ర ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంలో ఉంది.
అయితే తమకు అందిన నిఘా సమాచారం, సోషల్ మీడియా ఆధారాల ప్రకారం ఆ సంస్థకు చెందిన సాయుధ సభ్యులు కేటాయించిన శిబిరాల వెలుపల సంచరిస్తున్నట్లు గుర్తించామని రక్షణ శాఖ తెలిపింది.
ఇది కాల్పుల విరమణ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. ఈ విషయాన్ని అధికారిక కాల్పుల విరమణ పర్యవేక్షణ బృందానికి కూడా తెలియజేసినట్లు వెల్లడించింది.
వివరాలు
కాల్పుల విరమణ నిబంధనల ఉల్లంఘన?
గాలింపు చర్యల సందర్భంగా మకుయిలాంగ్డి, ఓక్లాంగ్ గ్రామాల వైపు వెళ్తున్న అస్సాం రైఫిల్స్ బృందాలను స్థానికులు,ముఖ్యంగా మహిళలు అడ్డుకున్నారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది అత్యంత సంయమనం పాటిస్తూ స్థానిక ప్రతినిధులతో మాట్లాడారని చెప్పారు.
గ్రామ పెద్దల అనుమతి లేకుండా ఏ గ్రామంలోనూ ప్రవేశించబోమని, ఈ ఆపరేషన్ లక్ష్యం శాంతిభద్రతలను కాపాడటమేనని వారికి వివరించినట్లు తెలిపారు.
అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో సెనాపతి పట్టణంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి అస్సాం రైఫిల్స్ శిబిరం వైపు ర్యాలీగా కదిలారు.
అక్కడికి చేరుకున్న కొందరు రాళ్లు రువ్వడంతో పాటు శిబిరానికి నిప్పంటించే ప్రయత్నం చేసినట్లు అధికారులు వెల్లడించారు.
వివరాలు
కాల్పుల విరమణ నిబంధనల ఉల్లంఘన?
దీంతో సెనాపతి పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందిని రంగంలోకి దింపగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బ్లాంక్ రౌండ్లు కాల్చి టియర్గ్యాస్ ప్రయోగించారు.
తిరిగి వెళ్తున్న సమయంలో గుంపులోని కొందరు అస్సాం రైఫిల్స్కు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు.
ఒక తేలికపాటి వాహనానికి నిప్పంటించగా, రెండు ట్రక్కులను ధ్వంసం చేశారు.
హింసాత్మక ఘటనల్లో ఒక ప్రైవేట్ కారు కూడా దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు.
భద్రతా బలగాలు, మణిపూర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన చర్యలతో అర్ధరాత్రి నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం సెనాపతిలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఈ ఘటనలో స్థానికులు లేదా భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు, ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేశారు.