LOADING...
LPG Shortage: ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

LPG Shortage: ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 06, 2026
10:43 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ భారత్‌లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడం, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. దేశంలో ఎల్పీజీ సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్రం 5 కిలోల చిన్న సిలిండర్ల (ఎఫ్‌టీఎల్ సిలిండర్లు) సరఫరాను వేగవంతం చేసింది. సాధారణంగా వినియోగంలో ఉన్న 14.2 కిలోల సబ్సిడీ సిలిండర్లకు భిన్నంగా, ఇవి మార్కెట్ ధరలకే లభిస్తాయి. సమీప గ్యాస్ ఏజెన్సీలలో కౌంటర్‌పై నేరుగా వీటిని కొనుగోలు చేయవచ్చు. ఈ చిన్న సిలిండర్లకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

వివరాలు

బ్లాక్ మార్కెటింగ్‌పై కట్టడి చర్యలు

మార్చి 23 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 6.6 లక్షల సిలిండర్లు విక్రయమైనట్లు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎల్పీజీ కొరత సమయంలో ఇవి వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ ఎఫ్‌టీఎల్ సిలిండర్ల ప్రత్యేకత ఏమిటంటే, కొనుగోలు కోసం చిరునామా రుజువు అవసరం లేదు. కేవలం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID ప్రూఫ్) చూపిస్తే సరిపోతుంది. దీంతో ఎవరైనా సులభంగా వీటిని పొందగలుగుతున్నారు. ఇక ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ నిల్వల విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. భయాందోళనలతో అధికంగా కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరుతూ, బ్లాక్ మార్కెటింగ్‌పై కట్టడి చర్యలు ప్రారంభించింది.

వివరాలు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,700కు పైగా తనిఖీలు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 3,700కు పైగా తనిఖీలు నిర్వహించి, దాదాపు 1,000 షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 36 మంది డీలర్లపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది. మరోవైపు దేశంలోని రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గృహ అవసరాలు, రవాణా రంగాలకు సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగుతోందని తెలిపింది. రాబోయే రోజుల్లో LNG సరఫరా పెరగడంతో పరిస్థితి మరింత మెరుగుపడే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. మొత్తంగా ఎల్పీజీ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు వినియోగదారులకు గణనీయమైన ఊరట కలిగిస్తున్నాయి.

Advertisement