Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ అంశాన్ని స్వయంగా సుమోటోగా పరిగణించిన సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీజేఐ ఘాటుగా స్పందించారు (Chief Justice Slams NCERT).
వివరాలు
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు
విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి బేషరుతుగా క్షమాపణలు తెలిపింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సమర్థించడం లేదని, తాము దీనికి మద్దతు ఇవ్వబోమని కేంద్ర తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు స్పష్టం చేశారు. ఇక విచారణలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "వాళ్లు వదిలిన బుల్లెట్ కారణంగా న్యాయవ్యవస్థ రక్తస్రావం చెందుతోంది. న్యాయవ్యవస్థ అధికారాన్ని దెబ్బతీయడమే కాకుండా, దాని గౌరవాన్ని కూడా తగ్గించాలనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్టు కనిపిస్తోంది" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.