Actress Prathyusha Case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు..సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది. రెండు దశాబ్దాలకు పైగా సాగిన ఈ వ్యవహారంలో జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించిన కోర్టు,నాలుగు వారాల లోపు అతడు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సినీ నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న కన్నుమూశారు.ఈ ఘటనకు సంబంధించి సిద్ధార్థరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అతడికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సిద్ధార్థరెడ్డికి అక్కడ శిక్షను రెండేళ్లకు తగ్గించారు. ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రత్యూష తల్లి సరోజిని సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వివరాలు
24 ఏళ్ల తర్వాత ఈ రోజు తుది తీర్పు
అదే సమయంలో తనపై విధించిన శిక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుతూ సిద్ధార్థరెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు సవివరంగా విన్నది. గత సంవత్సరం నవంబర్లో విచారణను ముగించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్లో ఉంచింది. చివరకు 24 ఏళ్ల తర్వాత ఈ రోజు తుది తీర్పును వెలువరించిన కోర్టు, సిద్ధార్థరెడ్డి తప్పనిసరిగా లొంగిపోవాలని స్పష్టం చేసింది. 2002లో తాను,ప్రత్యూష ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించామని, ఆసుపత్రిలో చికిత్స పొందడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని సిద్ధార్థరెడ్డి వాదించారు. అయితే తన కుమార్తె ఆత్మహత్యకు సిద్ధార్థరెడ్డే కారణమని సరోజిని ఆరోపించారు.