Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్.. రాబోయే శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో సిట్ అధికారుల సమక్షంలో లొంగిపోవాలని స్పష్టంగా ఆదేశించింది. కస్టడీ ఆధారిత విచారణకు సిట్కు అనుమతి ఇస్తూనే, ప్రభాకర్రావుకు శారీరకంగా ఎలాంటి నష్టం కలగకుండా చూడాలని కోర్టు సూచించింది. కోర్టు ఇప్పటికే ఇచ్చిన మధ్యంతర రక్షణ ఉన్నప్పటికీ, ప్రభాకర్రావు దర్యాప్తుతో సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
వివరాలు
రెండు మాత్రమే రీసెట్ చేశారు: సిద్ధార్థ లూథ్రా
ఐక్లౌడ్ పాస్వర్డ్లను రీసెట్ చేసి అందులోని డేటాను విచారణ అధికారులకు అందించాలని కోర్టు ఆదేశించినా,ఆయన రెండు మాత్రమే రీసెట్ చేశారని, అవి కూడా ముందే డిలీట్ చేసిన వివరాలేనని లూథ్రా తెలిపారు. దీనిపై జస్టిస్ నాగరత్నస్పందిస్తూ,"మధ్యంతర రక్షణ కారణంగా పిటిషనర్ దర్యాప్తుకు పూర్తిగా సహకరించట్లేదని రాష్ట్రం చెబుతోంది.దీనిపై మీ అభిప్రాయం ఏంటి?"అని ప్రభాకర్రావు తరఫున వాదిస్తున్న న్యాయవాది రంజిత్కుమార్ను ప్రశ్నించారు.
వివరాలు
పిటిషనర్ సహకరిస్తున్న విషయాలన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించాం:రంజిత్కుమార్
దీనికి ఆయన,పిటిషనర్ సహకరిస్తున్న విషయాలన్నీ అఫిడవిట్ రూపంలో సమర్పించామని తెలిపారు.అయితే ఆ అఫిడవిట్ మంగళవారం సాయంత్రం 4గంటలకు మాత్రమే దాఖలయ్యిందని,అందువల్ల దాన్ని పరిశీలించేందుకు అవకాశం లభించలేదని సిద్ధార్థ లూథ్రా తెలిపారు. ప్రభుత్వం తన స్పందన ఇవ్వడానికి సమయం కోరడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభాకర్రావు సిట్ అధికారి ఎదుట శుక్రవారం లొంగిపోవాలనే ఆదేశాలను జారీ చేసింది.