Suvendu Adhikari: బెంగాల్లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. కోల్కతాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత సువేందును బెంగాల్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొత్త ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది. రేపే బెంగాల్లో కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్షా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశముంది.
వివరాలు
కీలక మలుపుగా నందిగ్రామ్ ఉద్యమం
2006 నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం వేగంగా ఎదిగింది. అదే ఏడాది కొంటాయీ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తరువాత కొంటాయీ పురపాలక సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లపాటు సేవలందించారు. సువేందు రాజకీయ జీవితంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక మలుపుగా నిలిచింది. నందిగ్రామ్ ప్రాంతంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు కోసం వేల ఎకరాల భూమి సేకరణకు అప్పటి వామపక్ష ప్రభుత్వం ప్రయత్నించగా తృణమూల్ కాంగ్రెస్ పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టింది. ఆ ఉద్యమానికి సువేందు నాయకత్వం వహించారు.ఈ పోరాటం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంత బాధ్యతలను పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు అప్పగించారు. ఆ తర్వాత మమతకు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
వివరాలు
మమత తర్వాత స్థానం సువేందుదే..
2009లో తమ్లుక్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచిన సువేందు జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. తృణమూల్ కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగిన సువేందు ప్రభావం 2017 తర్వాత మరింత పెరిగింది. పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ బయటకు వెళ్లిన తర్వాత మమత తర్వాత స్థానం సువేందుదేననే అభిప్రాయం నెలకొంది. అయితే మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధిక ప్రాధాన్యం ఇవ్వడం, భవిష్యత్తులో పార్టీ బాధ్యతలు అప్పగించేలా పరిస్థితులు మారడం సువేందుకు అసంతృప్తి కలిగించింది.
వివరాలు
2020 చివర్లో తృణమూల్ కాంగ్రెస్ను వీడి భాజపాలో..
ఇదే సమయంలో శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ఆయనపై ఒత్తిడి పెరిగింది. ఈ పరిణామాల మధ్య 2020 చివర్లో తృణమూల్ కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన సువేందు అధికారి విజయం సాధించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వర్తించారు. అదే ఎన్నికల్లో భవానీపుర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై గెలిచి దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు కేంద్రబిందువయ్యారు.