LOADING...
Tamil Nādu: మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!
మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!

Tamil Nādu: మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!

వ్రాసిన వారు Sirish Praharaju
May 07, 2026
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, అవసరమైన సంఖ్యాబలం విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ చెబుతున్నా, గవర్నర్ ఆర్వీ అర్లేకర్ మాత్రం ఇంకా సంతృప్తి చెందలేదు. దీంతో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయినట్లైంది. గురువారం ఉదయం రాజ్‌భవన్‌కు విజయ్‌ను పిలిపించిన గవర్నర్, ఆయన ముందు కీలక ప్రశ్నలు ఉంచారు. అసెంబ్లీలో మెజారిటీకి 118 మంది సభ్యుల మద్దతు అవసరమని, కానీ టీవీకేకు కేవలం 108 మంది మాత్రమే ఉన్నారని గుర్తుచేశారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎలా నడుపుతారో వివరించాలని కోరారు.

వివరాలు 

ఫ్లోర్ టెస్ట్‌కు తాను సిద్ధమని గవర్నర్‌కు స్పష్టం చేసిన విజయ్

మీకు మద్దతు ఇస్తున్న పార్టీలు ఏవో స్పష్టంగా చెప్పాలని కూడా సూచించారు. బుధవారం జరిగిన భేటీలో కూడా విజయ్ ప్రతిపాదనను గవర్నర్ అంగీకరించలేదని సమాచారం. ఇక అసెంబ్లీ సమీకరణాలు చిక్కుముడిగా మారాయి. టీవీకేకు 108 సీట్లు ఉండగా, మెజారిటీకి మరో 10 మంది అవసరం. కాంగ్రెస్‌కు చెందిన 5 మంది, ఎడమపక్షాలకు చెందిన 4 మంది, వీసీకేకు చెందిన 2 మంది, పీఎంకేకు చెందిన 4 మంది మద్దతు లభిస్తే మొత్తం బలం 123కి చేరుతుందని విజయ్ లెక్కలు వేసుకుంటున్నారు. తాను గెలిచిన రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేస్తే బలం 122 అవుతుందని భావిస్తున్నారు. ఫ్లోర్ టెస్ట్‌కు సిద్ధమని కూడా ఆయన తెలిపినట్లు సమాచారం.

వివరాలు 

మిత్రపక్షాల మద్దతుపై గవర్నర్‌కు అనుమానాలు, ప్రశ్నలు

అయితే ఈ కూటమి ఏర్పాటు అంత సులభం కాదని స్పష్టమవుతోంది. వీసీకే ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉండగా, పీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. ఈ రెండు పార్టీలు తమ ప్రస్తుత కూటములను విడిచిపెట్టకపోతే విజయ్‌కు మద్దతు ఇవ్వడం సాధ్యం కాదు. అంతేకాకుండా మతపరమైన శక్తులతో ఎలాంటి సంబంధం ఉండకూడదనే నిబంధనతోనే కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పింది. ఈ క్లిష్ట పరిస్థితుల వల్లే గవర్నర్ ఇంకా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకేతో టీవీకే పొత్తు కుదుర్చుకుంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల సమయంలో విజయ్ డీఎంకే, బీజేపీలపై తీవ్ర విమర్శలు చేసినప్పటికీ అన్నాడీఎంకేపై మాత్రం పెద్దగా స్పందించలేదు. దీంతో ఆ పార్టీలోని కొంతమంది సభ్యులు విజయ్‌కు మద్దతు ఇవ్వవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

వివరాలు 

టీవీకే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రిసార్టులకు తరలింపుతో పెరిగిన ఉత్కంఠ

కొంతమంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని రిసార్టుకు వెళ్లినట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను ఆ పార్టీ నేతలు సీవీ షణ్ముగం, కేపీ మునుస్వామి ఖండిస్తూ, విజయ్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఏ కూటమి కూడా ఖరారు కాకపోతే కొత్త అసెంబ్లీని నిలిపివేసి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. అలా జరిగితే మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో విజయ్ తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురం రిసార్టుకు తరలించారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ, పరిస్థితులను అంచనా వేసుకుంటూ నిబంధనలకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement