LOADING...
TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు

TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 16, 2026
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న టీసీఎస్ బీపీఓ కేంద్రంలో పెద్ద వివాదం రేగింది. లైంగిక వేధింపులు, మానసిక హింస, బలవంతపు మత మార్పిడి ఆరోపణలు వెలుగులోకి రావడంతో సంస్థ తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది. ఉద్యోగులందరినీ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని సూచించింది. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటివరకు కనీసం 9 మంది మహిళా ఉద్యోగులు ముందుకు వచ్చి,సంవత్సరాలుగా లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. కొంతమంది ఉద్యోగులను బలవంతంగా మాంసాహారం తినమని,మతాచారాల్లో పాల్గొనమని ఒత్తిడి చేసినట్లు కూడా వెల్లడించారు. నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ప్రకారం, ఏడుగురు వ్యక్తులు గ్యాంగ్‌లా వ్యవహరిస్తూ మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.

వివరాలు 

2022 నుంచి ఈ వేధింపులు..

ఈ కేసుల్లో ఇప్పటివరకు 9 ఎఫ్ఐఆర్‌లు నమోదు కాగా, 8 మందిని అరెస్ట్ చేశారు. మరో మహిళ పరారీలో ఉంది. టీమ్ లీడర్లుగా ఉన్న కొందరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు. ఒక హెచ్ఆర్ అధికారి ఫిర్యాదు చేయొద్దని బాధితురాలిని నిరుత్సాహపరిచినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. 2022 నుంచి ఈ వేధింపులు కొనసాగుతున్నాయని ఎఫ్ఐఆర్‌లు చెబుతున్నాయి. లైంగిక వేధింపులు, అసభ్య వ్యాఖ్యలు, స్టాకింగ్, వ్యక్తిగత విషయాలపై వేధింపులు వంటి అంశాలు బయటపడ్డాయి. అలాగే మతపరమైన అవమానాలు, బలవంతపు మార్పిడి ప్రయత్నాలు కూడా జరిగినట్లు సమాచారం.

వివరాలు 

స్పందించిన టాటా సన్స్ చైర్మన్

ఇదిలా ఉండగా, ఈ కేసుకు పెద్ద స్థాయి లింకులు ఉన్నాయా అన్న కోణంలో SID, ATS, NIA వంటి సంస్థలు కూడా దర్యాప్తులో చేరాయి. మహిళల సంఘం NCW కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించి, ఏప్రిల్ 18న అక్కడికే వెళ్లి వాస్తవ పరిస్థితులను తెలుసుకోనుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఆరోపణలను చాలా ఆందోళనకరంగా పేర్కొంటూ, పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతోందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement