Teacher Recruitment Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. 30 మంది నుంచి రూ.1.2 కోట్ల వసూళ్లు!
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్లో సంచలనం రేపిన బీపీఎస్సీ (BPSC TRE-3) టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న డాక్టర్ మనీష్ కుమార్ను బిహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ (EOU) అధికారులు అరెస్ట్ చేశారు. దర్యాప్తులో అతడు 30 మంది అభ్యర్థుల నుంచి దాదాపు రూ.1.2 కోట్లు వసూలు చేసినట్లు వెల్లడైంది. అధికారుల సమాచారం ప్రకారం, డాక్టర్ శివ్, డాక్టర్ శుభమ్లతో కలిసి మనీష్ కుమార్ ప్రశ్నపత్రాల లీక్కు పాల్పడినట్లు గుర్తించారు. సీల్ చేసి భద్రపరిచిన ప్రశ్నపత్రాల పెట్టెలను తెరిచి, ఎలాంటి అనుమానం రాకుండా తిరిగి యథావిధిగా సీల్ చేసినట్లు విచారణలో తేలిందని ఈవోయూ వెల్లడించింది.
వివరాలు
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మంది అరెస్ట్
2024 మార్చి 15న నిర్వహించిన బీపీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షకు ముందు రోజు పట్నాలోని ఓ హోటల్లో 30 మంది అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను అందజేసినట్లు అధికారులు తెలిపారు.
పరీక్షకు ఒక రోజు ముందే ఆ హోటల్పై పోలీసులు దాడి నిర్వహించినప్పటికీ, మనీష్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
అనంతరం సీసీటీవీ ఫుటేజ్తో పాటు సాంకేతిక ఆధారాలను విశ్లేషించిన దర్యాప్తు బృందం అతడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకుంది.
ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 296 మందిని అరెస్ట్ చేసినట్లు బిహార్ ఎకనామిక్ అఫెన్సెస్ యూనిట్ వెల్లడించింది.