Hyd Airport: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తిగా రద్దు చేయబడ్డాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దు కాగా,హైదరాబాద్-కౌలాలంపూర్,హైదరాబాద్-వియత్నాం విమానాలను సాంకేతిక లోపాల కారణంగా రద్దు చేశారు. అదనంగా, హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్బస్ 984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి 11 గంటల నుంచి ఆలస్యమవుతూ వస్తోంది. దీని కారణంగా ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో వేచి ఉండాల్సి వచ్చింది. విమాన సంస్థ అధికారులు స్పందించకపోవడంతో అసహనం చెందిన ప్రయాణికులు ఎయిర్లైన్స్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
Details
ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కూడా సాంకేతిక సమస్య
ఇక దిల్లీలోని ఎయిర్పోర్ట్లో కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. శుక్రవారం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) సిస్టమ్లో సాంకేతిక లోపం తలెత్తడంతో దాదాపు 500 దేశీయ, అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆటోమేటెడ్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS)లో తలెత్తిన లోపం వల్ల విమానాల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ వ్యవస్థ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యకలాపాలకు కీలకమైనదిగా, దానిలో లోపం రావడంతో పలు మార్గాల్లో విమానాల షెడ్యూల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దేశంలోని మూడు ప్రధాన విమానాశ్రయాల్లో ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్లలో — ప్రయాణికులు భారీ అసౌకర్యాలను ఎదుర్కొంటున్నారు.