Bengaluru: గాల్లో ఉండగానే సాంకేతిక సమస్య.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయల్దేరిన ఓ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి వెనక్కి వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానాశ్రయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం ఆదివారం ఉదయం 8.20 గంటలకు బెంగళూరు నుంచి లండన్కు బయల్దేరింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో సాంకేతిక సమస్య ఉన్నట్లు పైలట్లు గుర్తించారు.
వివరాలు
సమస్యకు గల కారణాన్ని పరిశీలిస్తున్న అధికారులు
వెంటనే పైలట్లు ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేశారు. అనంతరం విమానాన్ని అరగంటకు పైగా గాల్లోనే చక్కర్లు కొట్టించారు.
పరిస్థితిని పరిశీలించిన తర్వాత విమానాన్ని తిరిగి బెంగళూరు విమానాశ్రయానికి తీసుకొచ్చారు. విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఘటన జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 270 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా కిందకు దించారు. అనంతరం విమానాన్ని సాంకేతిక తనిఖీల కోసం తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి డీజీసీఏ అధికారులు దర్యాప్తు చేపట్టారు. విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్యకు గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు.