Bihar: బీహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై నిరసన.. తేజస్వి యాదవ్ అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పాట్నలో పార్టీ నిర్వహించిన రాజ్భవన్ మార్చ్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సివాన్ జిల్లాలో గత నెల విద్యార్థుల నిరసన సమయంలో ఓ కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్తో కాల్పులు జరిపిన ఘటనకు నిరసనగా ఆర్జేడీ ఈ ఆందోళన చేపట్టింది. పాట్నాలోని జేపీ గోల్అంబర్ వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అక్కడి నుంచి రాజ్భవన్ వైపు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు వాటర్ కేనన్లు ప్రయోగించి మార్చ్ను నిలిపివేశారు.
వివరాలు
ఏకే-47తో కాల్పులు జరిపిన విషయాన్ని బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించింది
ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆదేశాల మేరకే పోలీసులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆర్జేడీ నేతలు ఆరోపించారు.
ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారని, ఇలాంటి చర్యలతో తమ ఉద్యమాన్ని అడ్డుకోలేరని స్పష్టం చేశారు.
ఆర్జేడీ ఎంపీ మీసా భారతి కూడా తేజస్వి యాదవ్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పేపర్ లీక్లు, నిరుద్యోగం, విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ఆమె ప్రస్తావించారు.
విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపిన విషయాన్ని బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించిందని ఆమె పేర్కొన్నారు.
ఏకే-47ను ఉపయోగించేందుకు కానిస్టేబుల్కు ఎవరు అనుమతి ఇచ్చారో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మీసా భారతి డిమాండ్ చేశారు.
వివరాలు
కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన అధికారులు
జూలై 25న నీట్ ప్రశ్నాపత్రం లీక్కు వ్యతిరేకంగా సివాన్లో విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ఆ సమయంలో ఓ కానిస్టేబుల్ ఏకే-47 రైఫిల్తో కాల్పులు జరిపిన దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఘటనపై తీవ్ర చర్చ జరిగింది. అనంతరం సంబంధిత కానిస్టేబుల్ను అధికారులు సస్పెండ్ చేశారు.
జిల్లా ఎస్పీపై కూడా బదిలీ వేటు వేశారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కాల్పుల కారణంగా ఎవరూ గాయపడలేదని తెలిపింది.
అలాగే, కానిస్టేబుల్ను కొందరు వ్యక్తులు చుట్టుముట్టిన పరిస్థితిలోనే అతడు కాల్పులు జరిపినట్లు ప్రభుత్వం కోర్టుకు వివరించింది.