Britain:బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం
ఈ వార్తాకథనం ఏంటి
శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్ పీర్) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. యువతలో నైతిక నాయకత్వం,సామాజిక న్యాయం,గాంధేయ ఆలోచనలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 'మహాత్మాగాంధీ ఫ్యూచర్ లీడర్స్ ప్రోగ్రామ్'ను ప్రారంభించి చురుకుగా పనిచేస్తున్నారు.
వివరాలు
కృత్రిమ మేధతో పాటు గ్లోబల్ గవర్నెన్స్ రంగాల్లో విశేష పరిశోధన,సేవలు
అదే విధంగా 'ఏఐ పాలసీ ల్యాబ్స్'ను స్థాపించి కృత్రిమ మేధతో పాటు గ్లోబల్ గవర్నెన్స్ రంగాల్లో విశేష పరిశోధన,సేవలు అందిస్తున్నారు. రెండేళ్లక్రితం నార్త్ బెడ్ఫోర్డ్షైర్ నియోజకవర్గం నుంచి లేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప తేడాతో రెండో స్థానంలో నిలిచినా,ఆయన సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రధాని Keir Starmer సిఫార్సు మేరకు King Charles III ఆయనను ఎగువ సభ సభ్యుడిగా నియమించారు. ఇకపై ఆయన 'లార్డ్ నాగరాజు ఆఫ్ బ్లూమ్స్బరీ'గా ప్రసిద్ధి చెందనున్నారు.తన పేరుతో 'బ్లూమ్స్బరీ' అనుసంధానం కావడానికి కారణం..అక్కడే ఉన్న ప్రఖ్యాత University College Londonలో ఆయన ఉన్నత విద్యను పూర్తి చేయడం. గాంధీ చదివిన అదేకళాశాలలో నాగరాజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.