
Piracy: తెలంగాణ సైబర్ క్రైమ్.. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠా పట్టివేత
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం కలిగించారని అంచనా వేస్తున్నారు. గతంలో '#సింగిల్' సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టి, జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను అరెస్ట్ చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
Details
కంటెంట్ ను ఇతర వెబ్ సైట్లకు విక్రయిస్తున్న ముఠా
అంతేకాక ఈటీవీ విన్ కంటెంట్ను పైరసీ చేసి అమ్మిన మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేశారు. రికార్డు చేసిన కంటెంట్ను ఇతర వెబ్సైట్లకు ముఠా విక్రయిస్తోంది. అలాగే, ఓటీటీ ప్లాట్ఫామ్లకు (ఐబొమ్మ సహా) కూడా అమ్ముతోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్వర్డ్లను నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారు. ఏజెంట్లకు రికార్డు కెమెరాలు అందజేసి రహస్యంగా చిత్రీకరించడం, తరువాత వారికి టికెట్లు బుక్ చేసి థియేటర్లలో చిత్రీకరించడం, చొక్కా జేబులు, పాప్కార్న్ డబ్బాలు, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి సినిమా రికార్డింగ్ చేస్తున్నారు. పైగా ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు అందిస్తున్నారు.