Telangana: బీటెక్ అదనపు సీట్లపై కసరత్తు.. తుది విడత కౌన్సెలింగ్కు ముందు నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్ల అంశంపై దృష్టి సారించింది. ఈ విద్యా సంవత్సరానికి (2026-27) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కళాశాలలకు కలిపి సుమారు 15వేల అదనపు సీట్లకు ఆమోదం తెలిపింది. అయితే, ఏఐసీటీఈ అనుమతి లభించినంత మాత్రాన ఈ సీట్లు కౌన్సెలింగ్లో అందుబాటులోకి రావు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతించిన తర్వాతే వాటిని కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చే అవకాశం ఉంటుంది. కొద్ది రోజుల క్రితం అదనపు సీట్లు మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలల వివరాలను సంబంధిత విశ్వవిద్యాలయాల నుంచి విద్యాశాఖ అధికారులు సేకరించారు.
వివరాలు
80 శాతం సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలకు ప్రాధాన్యం
అనంతరం ఆ వివరాలతో కూడిన నివేదికను మంగళవారం ముఖ్యమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్కు సమర్పించి పరిస్థితిని వివరించినట్లు సమాచారం.
అదనపు సీట్ల మంజూరులో కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఎన్బీఏ,న్యాక్ అక్రిడిటేషన్ కలిగి ఉండటం, స్వయంప్రతిపత్తి హోదా ఉండటం,కనీసం 80 శాతం సీట్లు భర్తీ అవుతున్న కళాశాలలకు ప్రాధాన్యం ఇవ్వాలనే అభిప్రాయంలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తుది విడత కౌన్సెలింగ్కు ముందుగా కనీసం 3 వేల నుంచి 4 వేల వరకు అదనపు బీటెక్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విద్యావర్గాలు అంచనా వేస్తున్నాయి.
అదనపు సీట్లపై ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంతో రెండ్రోజుల్లో ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.