LOADING...
Night Safari: ముచ్చర్లలో నైట్‌ సఫారీ.. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు 
ముచ్చర్లలో నైట్‌ సఫారీ.. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు

Night Safari: ముచ్చర్లలో నైట్‌ సఫారీ.. 203 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 25, 2025
02:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో నిర్మితమవుతున్న ఫ్యూచర్‌ సిటీలో ప్రత్యేక ఆకర్షణగా 'నైట్‌ సఫారీ' ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ ప్రణాళికలు కీలక దశకు చేరుకున్నాయి. జంతు ప్రియులు, పర్యాటకులు ఎక్కువగా ఆకర్షితులు కావడానికి అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ప్రత్యేక రూపకల్పన చేపట్టింది. ముచ్చర్ల ప్రాంతంలో 203.83 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్క్‌ నిర్మాణం జరగనుంది. ప్రకృతి ఒడిలో వినోదం,విజ్ఞానం,సాహసం.. అన్నీ ఒకేచోట దొరికేలా ఈ పార్క్‌ రూపకల్పన జరుగుతోంది. పిల్లల కోసం డైనోసార్‌ పార్క్‌, వర్చువల్‌ రియాలిటీ (VR) పార్క్‌ వంటి ప్రత్యేకమైన ఆకర్షణలు అందుబాటులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం అవసరమైన భూమిని టీజీఐఐసీ లీజ్‌ పద్ధతిలో ఎఫ్‌డీసీకి కేటాయించనుంది.

వివరాలు 

సౌకర్యాలు 

ఈ పార్క్‌లో సందర్శకులకు అన్ని సదుపాయాలు కల్పించబడతాయి. టికెటింగ్‌ కౌంటర్లు, విశాలమైన పార్కింగ్‌ ప్రదేశాలు, భద్రతా తనిఖీలు, ఓరియంటేషన్‌ సెంటర్‌, సమాచార కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి. అలాగే ఫుడ్‌కోర్టులు, కేఫ్‌టేరియాలు, బొమ్మల షాపులు, ఇతర షాపింగ్‌ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు. నైట్‌ సఫారీలో వర్చువల్‌ రియాలిటీ పార్క్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలోకి ప్రవేశిస్తే జంతువుల మధ్య అడవిలో తిరుగుతున్న అనుభూతి లేదా అంతరిక్షంలో ప్రయాణిస్తున్న అనుభవం కలుగుతుంది. చిన్నారుల కోసం ప్రత్యేకంగా డైనోసార్‌ పార్క్‌ కూడా ప్రతిపాదించారు. అక్కడ డైనోసార్‌ విగ్రహాలతో పాటు ప్రాచీన యుగ వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం జరుగుతుంది. యువతను ఆకట్టుకునేందుకు అడ్వెంచర్‌ పార్క్‌ కూడా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు.

వివరాలు 

రెండు దశల్లో అభివృద్ధి 

ముచ్చర్లలో ఏర్పాటు చేయబోయే జూ పార్క్‌ను రెండు దశల్లో నిర్మించనున్నారు. మొత్తం 203.80 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. టీజీఎఫ్‌డీసీ, టీజీఐఐసీ, అటవీ మరియు రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్త సర్వే కూడా పూర్తిచేశారు. 92 నుండి 105 వరకూ ఉన్న సర్వే నంబర్లలో ఈ భూమిని గుర్తించారు. ఇందులో 46 ఎకరాలకు సంబంధించి కొన్ని న్యాయపరమైన సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిష్కరిస్తుందని అధికారుల సమాచారం. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎఫ్‌డీసీ ముందుకు తీసుకెళ్లనుంది.

వివరాలు 

రాత్రి సఫారీ - ప్రత్యేకత 

సాధారణ జూ పార్కుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకే సందర్శకులను అనుమతిస్తారు. అక్కడ పులులు, సింహాలు వంటి మాంసాహార జంతువులు, జింకలు వంటి శాకాహార జంతువులు ఉంటాయి. కానీ ముచ్చర్లలో ఏర్పాటవుతున్న నేషనల్‌ జూ పార్క్‌ మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇక్కడ నైట్‌ సఫారీ ద్వారా రాత్రిపూట వన్యప్రాణుల సహజ ప్రవర్తనను ప్రత్యక్షంగా చూడవచ్చు. మన దేశంలో లేని అరుదైన జంతువులను కూడా ఇక్కడ ప్రదర్శించే అవకాశం ఉంది. జిరాఫీ, జీబ్రా, అన్టిలోప్‌, ఎలాండ్‌ వంటి విదేశీ ఖండాల శాకాహార జంతువులను ఇక్కడకు తీసుకురావాలనే ప్రతిపాదన ఉంది. సాయంత్రం తర్వాత ప్రారంభమయ్యే ఈ సఫారీలో వన్యప్రాణులు రాత్రివేళ ఎలా సంచరిస్తాయో పర్యాటకులు ప్రత్యక్షంగా వీక్షించగలుగుతారు.