Telangana: తెలంగాణ పీఎంశ్రీ పాఠశాలల్లో ఏఐ కోడింగ్ ల్యాబ్లు.. ఈ ఏడాదే ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు ఏఐ కోడింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ఏఐ పరిజ్ఞానం ప్రతి రంగంలో కీలకంగా మారనున్న నేపథ్యంలో విద్యార్థులు పాఠశాల దశ నుంచే ఈ సాంకేతికతను నేర్చుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ లక్ష్యంతో ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పాఠశాలలను ఎంపిక చేస్తోంది. ల్యాబ్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ ప్రారంభమైనందున 2026-27 విద్యా సంవత్సరంలోనే అవి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
33 పీఎంశ్రీ పాఠశాలలు ఏఐ హబ్లుగా..
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 794 ప్రభుత్వ పాఠశాలలను పీఎంశ్రీ స్కూళ్లుగా గుర్తించారు.
ఈ పాఠశాలల్లో అత్యాధునిక విద్యా సౌకర్యాలు కల్పించి, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.
ఇందులో భాగంగా జిల్లా కేంద్రాలు లేదా వాటి సమీప ప్రాంతాల్లో ఉన్న 33 రాష్ట్ర ప్రభుత్వ పీఎంశ్రీ పాఠశాలలను ఏఐ హబ్ స్కూళ్లుగా అభివృద్ధి చేయనున్నారు.
జిల్లాకు ఒకటి చొప్పున ఈ పాఠశాలలను ఎంపిక చేసి, వాటిలో అత్యాధునిక ఏఐ కోడింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
వివరాలు
రూ.40 కోట్లతో ఆధునిక సదుపాయాలు
పీఎంశ్రీ పథకం కింద ఏఐ కోడింగ్ ల్యాబ్ల ఏర్పాటుకు పాఠశాల విద్యాశాఖ మొత్తం రూ.40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది.
ఈ ల్యాబ్లలో కంప్యూటర్ ల్యాబ్తో పాటు రోబోటిక్స్కు అవసరమైన పరికరాలు, ఏఐ టూల్స్, కోడింగ్కు సంబంధించిన ఆధునిక సాఫ్ట్వేర్లు, ఇతర సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచనున్నారు.
దీంతో విద్యార్థులు కృత్రిమ మేధ, కోడింగ్, రోబోటిక్స్ వంటి భవిష్యత్ సాంకేతికతలను ప్రత్యక్షంగా నేర్చుకునే అవకాశం కలుగుతుంది.
వివరాలు
పాఠ్యాంశాల్లోనూ ఏఐకు ప్రాధాన్యం
పాఠశాల విద్యలో ఇప్పటికే ఏఐకు ప్రాధాన్యం పెరుగుతోంది. గత విద్యా సంవత్సరం (2025-26) నుంచి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణిత పాఠ్యపుస్తకాల్లో ఏఐ అంశాలను చేర్చారు.
ఇక ప్రస్తుత విద్యా సంవత్సరం (2026-27) నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం కూడా ప్రత్యేక ఏఐ పాఠ్యపుస్తకాన్ని సిద్ధం చేశారు.
పుణెకు చెందిన పై జామ్ ఫౌండేషన్ సహకారంతో ఎస్సీఈఆర్టీ బృందం ఈ పాఠ్యపుస్తకాన్ని రూపొందించింది.