పీఓపీ వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు.. అలాంటి చోట్ల చేయొద్దని ఆదేశం
వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్ సహా నగరంలోని చెరువుల్లో పీవోపీ (ప్లాస్టర్ ఆఫ్ పారిస్) విగ్రహాలను నిమజ్జనం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ(GHMC) ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్ (నీటి కుంటలు)ల్లో నిమజ్జనం చేయాలని సూచనలు చేసింది. PLASTER OF PARIS (POP) విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధిస్తూ గతంలోనే ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పటికీ అమల్లో ఉన్నాయని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేయడం గమనార్హం.