Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు? అధికారుల కసరత్తు షురూ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. వచ్చే డిసెంబరులో హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లతోపాటు మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీంతో పురపాలకశాఖ అధికారులు అప్రమత్తమై ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నారు. అక్టోబరు 19తో 'సర్' ప్రక్రియ పూర్తికానున్న నేపథ్యంలో.. ఆ తర్వాత కొంత సమయం తీసుకుని మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్రంలోని 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే అప్పటికి జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీకాలం పూర్తికాకపోవడంతో వాటికి ఎన్నికలు నిర్వహించలేదు.
వివరాలు
ఆరు మున్సిపాల్టీలకు కూడా ఎన్నికలు జరగలేదు
వివిధ కారణాలతో మందమర్రి, మణుగూరు, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు, సిద్దిపేట మున్సిపాల్టీలకు కూడా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించలేదు.
ఇప్పుడు వీటితోపాటు అప్పట్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాని ఇతర పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
వివరాలు
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
ఈ ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పదవీకాలం ముగిసింది.
ఆ తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించింది.
హైదరాబాద్ కార్పొరేషన్ను కొనసాగిస్తూ.. శివార్లలోని విలీన మున్సిపాల్టీలను కలిపి మల్కాజిగిరి, సైబరాబాద్ పేర్లతో మరో రెండు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది.
పోలీస్, మున్సిపల్ పరిధులు ఒకేలా ఉండాలన్న ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగానే ఈ విభజన చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా కార్పొరేషన్ పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది.
వివరాలు
డిసెంబరులోనే ఎందుకంటే..
ఇప్పుడు జీహెచ్ఎంసీ నుంచి ఏర్పడిన మూడు కార్పొరేషన్లతోపాటు తొలిదశలో ఎన్నికలు జరగని పట్టణ స్థానిక సంస్థలకు కూడా డిసెంబరులో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 'సర్' ప్రక్రియ కొనసాగుతుండటంతో పురపాలకశాఖ సిబ్బంది ఎక్కువగా దానిపైనే పనిచేస్తున్నారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వారికి కొంత విరామం ఇచ్చి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలనేది ప్రభుత్వ ఆలోచనగా సమాచారం.
డిసెంబరు నాటికి వాతావరణ పరిస్థితులు కూడా ఎన్నికల నిర్వహణకు మరింత అనుకూలంగా ఉంటాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అదే సమయంలో తాగునీటి సమస్యలు, విద్యుత్తు అంతరాయాలు కూడా కొంతమేర తగ్గే అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా ఎన్నికలకు ప్రజలను సన్నద్ధం చేయడానికి,అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసేందుకు అధికారులకు తగినంత సమయం లభిస్తుంది.
వివరాలు
డిసెంబరులోనే ఎందుకంటే..
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం డిసెంబరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని పురపాలకశాఖ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే చూచాయగా వెల్లడించినట్లు తెలుస్తోంది.
దీంతో అధికారులు కూడా ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు సమాచారం.