LOADING...
Telangana: బుద్వేల్‌ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం

Telangana: బుద్వేల్‌ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 24, 2025
08:55 am

ఈ వార్తాకథనం ఏంటి

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ప్రాంతీయ రింగ్‌ రోడ్డును అనుసంధానించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ప్రధాన రహదారుల విస్తరణ, అభివృద్ధితో పాటు కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇప్పటికే అవుటర్‌ రింగ్‌ రోడ్డులోని రావిర్యాల జంక్షన్‌ నుంచి మీర్‌ఖాన్‌పేట మీదుగా ఆమన్‌గల్‌ వరకు సుమారు 41.50 కిలోమీటర్ల పొడవుతో రతన్‌ టాటా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం కొనసాగుతోంది. దాదాపు రూ.4,621 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభమై, ఏడాదిలోపు పూర్తిచేయాలని హెచ్‌ఎండీఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే తరహాలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి కూడా హెచ్‌ఎండీఏ కసరత్తు మొదలుపెట్టింది.

వివరాలు 

డీపీఆర్‌కు సిద్ధమవుతున్న హెచ్‌ఎండీఏ 

బుద్వేల్‌ నుంచి టీజీఐఐసీ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానిస్తూ, జాతీయ రహదారి-167 వద్ద కోస్గి వరకు సుమారు 81 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయడానికి కన్సల్టెంట్‌ను నియమించనున్నారు. తొలుత కొత్వాల్‌గూడ నుంచి పరిగి వరకు 55 కిలోమీటర్లకే పరిమితం చేయాలని భావించినా, మరిన్ని ప్రాంతాలను కలుపుతూ రహదారి పరిధిని పెంచినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఓఆర్‌ఆర్‌ నుంచి ట్రిపుల్‌ ఆర్‌ను అనుసంధానించేలా విడతలవారీగా పలు రేడియల్‌ రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. మొత్తం 12 నుంచి 16 వరకు రేడియల్‌ రోడ్లను చేపట్టాలని యోచిస్తోంది.

వివరాలు 

ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌లకు చేరుకునే రహదారులను ప్రాధాన్య క్రమంలో అభివృద్ధికి నిర్ణయం 

ఇందులో భాగంగా ఓఆర్‌ఆర్‌లోని 22 జంక్షన్ల నుంచి ఉన్న రహదారులను విస్తరించి అభివృద్ధి చేయనున్నారు. అవసరమైన చోట్ల కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులను కూడా నిర్మించి అన్ని ప్రాంతాలకు అనుసంధానం కల్పించనున్నారు. భవిష్యత్తులో అవుటర్‌ రింగ్‌ రోడ్‌-ట్రిపుల్‌ ఆర్‌ మధ్య ప్రాంతంలో కొత్త నివాస, పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాలు విస్తరించనున్న నేపథ్యంలో, అన్ని దిశల నుంచి ఓఆర్‌ఆర్‌, ట్రిపుల్‌ ఆర్‌లకు చేరుకునే రహదారులను ప్రాధాన్య క్రమంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Advertisement