India TV-CNX Opinion Poll: తెలంగాణలో మూడోసారి అధికారం బీఆర్ఎస్దే.. ఒపీనియన్ పోల్ అంచనా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ప్రధాన పార్టీలు అటు ప్రచారం, ఇటు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీబిజీగా ఉన్నాయి. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నెలకొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే సమయంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ నిర్వహించిన ఒపీనియన్ పోల్ సర్వే ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ వెల్లడించింది. తెలంగాణలో పుంజుకుంటుందన్న ఊహాగానాల మధ్య నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెజారిటీ 60 సీట్లను సులభంగా దాటుతుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.
బీఆర్ఎస్ 70సీట్లు, కాంగ్రెస్కు 34 సీట్లు
2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే బీఆర్ఎస్ 18 సీట్లను కోల్పోతుదని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. అలాగే అధికార పార్టీపై కొంత వ్యతిరేకత కూడా ఉందని పేర్కొంది. బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో 70సీట్ల వరకు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్ 34, బీజేపీ 7 సీట్లు, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) 7సీట్లు గెలుచుకుంటుందని ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండాలని ఒపీనియన్ పోల్ ఫలితాలు చెప్పాయి. 43శాతం మంది ఆయనకు ఓటు వేశారు. సర్వేలో పాల్గొన్న వారిలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలని కేవలం 30 శాతం మంది అభిప్రాయపడ్డారు.