JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
ఈ వార్తాకథనం ఏంటి
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన 12 మందిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే కావడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ నుంచి పసల మోహిత్, నరేంద్రబాబుగారి మహిత్, తెలంగాణ నుంచి ఎం. వివాన్ శరత్ 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థుల జాబితాలో చోటు సంపాదించారు. విజయవాడలోని శ్రీచైతన్య క్యాంపస్లో చదువుతున్న వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ పూర్తి మార్కులు 300/300 సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘన విజయంతో, రెండో దశ పరీక్ష అనంతరం విడుదలయ్యే తుది ర్యాంకులలో మోహిత్ అత్యుత్తమ ర్యాంకును దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
పరీక్షలకు మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు
దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలలో 2026-27 విద్యా సంవత్సరానికి బీటెక్ ప్రవేశాల కోసం జనవరి 21 నుంచి 28 వరకు జేఈఈ మెయిన్-2026 తొలి విడత పేపర్-1 పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 13.55 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 13.04 లక్షల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.60 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాసి ఉంటారని అంచనా. సోమవారం ఉదయం 10 గంటల సమయంలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) తుది ఆన్సర్ 'కీ'ని విడుదల చేయగా, అదే రోజు సాయంత్రం 6.30 గంటలకు ఫలితాలను ప్రకటించడం విశేషంగా నిలిచింది.
వివరాలు
తుది విడత పరీక్షల తర్వాతే ర్యాంకులు....
జేఈఈ మెయిన్ తుది విడత ఆన్లైన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరగనున్నాయి. తొలి విడత రాసిన అభ్యర్థులు రెండో విడతకూ హాజరయ్యే అవకాశం ఉంది. రెండు దశలలో వచ్చిన స్కోర్లలో ఉత్తమమైనదాన్ని పరిగణనలోకి తీసుకొని, ఎన్టీఏ అఖిల భారత ర్యాంకులు మరియు వర్గాల వారీగా కటాఫ్ మార్కులను నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 2.50 లక్షల మంది అర్హులను ఎంపిక చేస్తారు. వీరికి మాత్రమే మే 17న జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి అర్హత లభిస్తుంది.