Bengal: బెంగాల్లో ఉద్రిక్తత.. తేయాకు రైతును కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఎస్ఎఫ్ ఓ బంగ్లాదేశీ చొరబాటుదారుడిని అదుపులోకి తీసుకున్న ఘటనకు ప్రతిస్పందనగా.. కొందరు బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి చొరబడి ఓ తేయాకు రైతును అపహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధిత రైతును బలవంతంగా బంగ్లాదేశ్ వైపు తీసుకెళ్లినట్లు సమాచారం. రాజ్గంజ్ బ్లాక్ పరిధిలో సరిహద్దు కంచెకు సమీపంలో ఉన్న తన తేయాకు తోటలో దీపాంకర్ గోప్ పని చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 15 మందికి పైగా బంగ్లాదేశీయులు ఒక్కసారిగా తోటలోకి వచ్చి దీపాంకర్పై దాడి చేసి, అక్కడి నుంచి ఈడ్చుకెళ్లినట్లు వారు ఆరోపించారు.
వివరాలు
బంగ్లాదేశ్ బీజీబీ అధికారులతో అత్యవసర ఫ్లాగ్ మీటింగ్
ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బంగ్లాదేశ్కు చెందిన వ్యక్తిని భారత్ నుంచి విడుదల చేస్తేనే.. అపహరించిన భారతీయ రైతును తిరిగి పంపిస్తామని బంగ్లాదేశ్ సరిహద్దు బలగాలు (బీజీబీ), అక్కడి స్థానికులు ఒత్తిడి చేస్తున్నట్లుగా వీడియోల్లో కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
భారతీయ రైతు అపహరణపై బీఎస్ఎఫ్ అధికారులు తీవ్రంగా స్పందించారు.
ఘటనపై బంగ్లాదేశ్ బీజీబీ అధికారులతో అత్యవసర ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు.
వివరాలు
స్థానిక తేయాకు తోటల సంఘాల ఆందోళన
అపహరణకు గురైన దీపాంకర్ గోప్ను వెంటనే భారత్కు అప్పగించాలని బీజీబీ అధికారులను కోరినట్లు సమాచారం.
మరోవైపు సరిహద్దు ప్రాంతాల్లో తేయాకు రైతులకు రక్షణపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ సొంత ప్రాంతంలోనే రైతులు భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి రావడంపై తేయాకు తోటల సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.