
pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి.. ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘోర దాడికి కారణమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. ఈ మేరకు ఎన్ఐఏ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. పహల్గాంలో ఉగ్రవాదుల దాడికి కారణమైన ముగ్గురు ముష్కరులకు ఆశ్రయం కల్పించిన పర్వీజ్, బషీర్లను అరెస్టు చేశామని ఎన్ఐఏ పేర్కొంది. వారిని ప్రశ్నించగా ఉగ్రవాదుల పేర్లు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినవారు పాకిస్థాన్ దేశీయులని, వారికీ లష్కరే తొయిబాతో సంబంధాలున్నాయని తేలిందని ఎన్ఐఏ పేర్కొంది. ఆశ్రయం కల్పించడం కాకుండా, ఉగ్రవాదులకు ఆహారం, రవాణా సదుపాయాలూ అందించారు. దీనిపై దర్యాప్తును కొనసాగిస్తున్నామని ఎన్ఐఏ వివరించింది.
Details
ఏప్రిల్ 22న ఘోరదాడి
ఏప్రిల్ 22న పహల్గాంలోని ప్రఖ్యాత బైసరన్ లోయలో ఉగ్రవాదులు పర్యాటకులపై పాశవిక దాడి చేశారు. ఈ ఘటనలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘోరదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్'ను చేపట్టి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై శక్తివంతమైన దాడులు జరిపింది. ఉగ్రస్థావరాలను నేలమట్టం చేయాలనే లక్ష్యాన్ని విజయవంతంగా సాధించింది. ఈ నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. భారత్ ప్రతీకార దాడుల తాకిడికి పాకిస్థాన్ చివరకు కాళ్లు బేరానికి వచ్చి కాల్పుల విరమణకే అంగీకరించింది.