Hyderabad: డిసెంబరు 19 నుంచి హైదరాబాద్లో 38వ పుస్తక ప్రదర్శన ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లో 38వ పుస్తక ప్రదర్శన (Hyderabad Book Fair) తేదీలు ఖరారయ్యాయి. ఈసారి డిసెంబరు 19 నుంచి 29వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన జరగనుంది. ఇందిరాపార్క్ సమీపంలోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రకటించింది. ఈ మేరకు ప్రదర్శన గోడపత్రికను సోమవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పుస్తక ప్రదర్శన సలహాదారులు ప్రొఫెసర్ కోదండరాం, సీనియర్ సంపాదకుడు కె.రామచంద్రమూర్తి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రదర్శనల్లో ఎదురైన లోపాలను సరిదిద్దుకుని ఈసారి అందంగా, విజ్ఞానదాయకంగా ప్రదర్శనను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Details
విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
పుస్తకావిష్కరణలు, సాహిత్య చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు, విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రదర్శనలో ముఖ్య ఆకర్షణలుగా ఉండనున్నాయని పేర్కొన్నారు. ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న వారు నవంబరు 30వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని కమిటీ అధ్యక్షుడు డా. యాకూబ్ షేక్, కార్యదర్శి ఆర్. శ్రీనివాస్ తెలిపారు. దరఖాస్తులు అన్ని పనిదినాల్లో హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కోశాధికారి పి. నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బి. శోభన్బాబు, సంయుక్త కార్యదర్శి కె. సురేశ్, కార్యవర్గ సభ్యులు ఎ. జనార్దన్ గుప్తా, యు. శ్రీనివాసరావు, టి. సాంబశివరావు, స్వరాజ్కుమార్, డి. కృష్ణారెడ్డి పాల్గొన్నారు.