PM Modi: మావోయిస్టుల నుంచి దేశానికి విముక్తి లభిస్తోంది : నరేంద్ర మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
మావోయిస్టుల హింస నుంచి దేశం పూర్తిగా విముక్తి పొందే రోజు త్వరలోనే రానుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ విషయంపై తాను హామీ ఇస్తున్నానని పేర్కొన్న ఆయన, ఒకప్పుడు దేశవ్యాప్తంగా 125 జిల్లాలు మావోయిస్టు ప్రభావంలో ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్యను మూడుకు పరిమితం చేశామని వివరించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంగా ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాయ్పుర్లో శనివారం జరిగిన పలు కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. నవా రాయ్పుర్ అటల్ నగర్లో ఏర్పాటు చేసిన ఛత్తీస్గఢ్ శాసనసభ నూతన భవనాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి, ''ఒకప్పుడు వెనుకబాటుతనానికి ప్రతీకగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఇప్పుడు అభివృద్ధి, భద్రత, స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు.
Details
50 ఏళ్లుగా మావోయిస్టుల హింసతో ఇబ్బంది పడ్డారు
'50 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు మావోయిస్టుల హింసతో సతమతమయ్యారు. రాజ్యాంగాన్ని చూపిస్తూ సామాజిక న్యాయం పేరుతో మొసలికన్నీరు కారుస్తూ అన్యాయం చేసిన వారు, తమ స్వప్రయోజనాలను మాత్రమే చూసుకున్నారంటూ విపక్ష కాంగ్రెస్పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అనంతరం నవా రాయ్పుర్లోని 'శాంతి శిఖర్ సెంటర్ ఫర్ స్పిరిచ్యువల్ అండ్ మెడిటేషన్ ఆఫ్ బ్రహ్మ కుమారీస్'ను కూడా ఆయన ప్రారంభించారు.
Details
శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రి సందర్శన
నవా రాయ్పుర్లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని మోదీ సందర్శించి, గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేయించుకున్న సుమారు 2,500 మంది చిన్నారులతో మాట్లాడారు. ఆసుపత్రికి చేరుకున్న మోదీకి 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్' వ్యవస్థాపకులు మధుసూదన్ సాయి స్వాగతం పలికారు. ఆసుపత్రుల ఛైర్మన్ శ్రీనివాసన్ ప్రధానికి ఒక చిత్రపటాన్ని అందజేశారు. చికిత్స పొందిన చిన్నారులకు ధ్రువపత్రాలు అందజేస్తూ, పుట్టపర్తి ప్రాంతంలో తాగునీటి సమస్యను సత్య సాయిబాబా ఎలా పరిష్కరించారో మోదీ చిన్నారులకు వివరించారు.
Details
సునీల్ గవాస్కర్ హాజరు
ఈ కార్యక్రమంలో భారత మాజీ క్రికెటర్, ఆసుపత్రి ట్రస్టీ సునీల్ గావస్కర్ కూడా పాల్గొన్నారు. 'వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్'లో భాగంగా సత్యసాయి సంజీవని ఆసుపత్రులు వందకు పైగా దేశాల్లో వైద్య, విద్య, పోషకాహార సేవలు అందిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. ఈ ఆసుపత్రుల సమూహం ప్రపంచంలోనే అతి పెద్ద ఉచిత పీడియాట్రిక్ కార్డియాక్ చైన్గా గుర్తింపు పొందిందని ఆయన చెప్పారు.
Details
గిరిజన యోధుల మ్యూజియం ప్రారంభం
తరువాత రాయ్పుర్లో షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్మారకంగా ఏర్పాటుచేసిన గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియాన్ని ప్రధానమంత్రి ప్రారంభించి పరిశీలించారు. 'ఛత్తీస్గఢ్ రాముడి అమ్మమ్మ ఊరు' శాసనసభ నూతన భవనం ప్రారంభోత్సవ సందర్భంగా మాట్లాడిన మోదీ, ఛత్తీస్గఢ్ రాముడి అమ్మమ్మ ఊరుగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ ప్రాంత మేనల్లుడే శ్రీరాముడని తెలిపారు. అలాగే తులసీదాసు రచించిన *రామచరిత మానస్* నుంచి కొన్ని పంక్తులను స్వయంగా ఆలపించారు.