'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
పురాతన, చారిత్రక సాంస్కృతిక మత స్థలాల పేర్లను మార్చే కమిషన్ను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతదేశం ఒక లౌకిక దేశమని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. హిందూ మతం ఒక జీవన విధానమని చెప్పుకొచ్చింది.
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లను విచారించరాదని పేర్కొంది.
దేశంలో బ్రిటిష్ వారు తీసుకొచ్చిన విభజించు-పాలించు విధానాన్ని ప్రస్తావించిన జస్టిస్ నాగరత్న.. ఇలాంటి పిటిషన్లతో మళ్లీ అలాంటి పరిస్థితిని తీసుకురావద్దని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు
దేశాన్ని గుర్తుంచుకోండి, మతాన్ని కాదు: సుప్రీంకోర్టు
దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ఇలాంటి పిటిషన్లను అనుమతించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎం జోసెఫ్ మాట్లాడుతూ.. తన రాష్ట్రం కేరళలో చర్చిల నిర్మాణానికి హిందూ రాజు భూమిని దానం చేసినట్లు గుర్తు చేశారు. హిందూ మతంలో మతోన్మాదం లేదని జస్టిస్ జోసెఫ్ అన్నారు.
బెంచ్ను ఒప్పించేందుకు పిటిషనర్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. చాలా చారిత్రక ప్రదేశాలలో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని, దేశంలో లోధి, గజినీ, ఘోరీ, ఇతర ఆక్రమణదారుల పేరు మీద రోడ్లు ఉన్నాయని, కానీ పాండవుల పేరుమీద ఒక్క రహదారి కూడా లేదన్నారు.
దేశాన్ని గుర్తుంచుకోవాలని, ఏ మతాన్ని కాదని ఈ సందర్భంగా కోర్టు చెప్పింది. ఇక్కడ చట్టబద్ధమైన పాలన, లౌకికవాదం, రాజ్యాంగవాదంతో ప్రభుత్వ వివాహం జరిగిందని ధర్మాసనం పేర్కొంది.