Ujjain Express derail: రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం చోటుచేసుకుంది. ఖండ్గావ్ సమీపంలోని రైల్వే యార్డులో షంటింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఖాళీగా ఉన్న ఉజ్జయిని ఎక్స్ప్రెస్ (ట్రైన్ నెం.14317) కు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన సోమవారం రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో యోగ నగరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని ఉత్తర రైల్వే మొరాదాబాద్ డివిజన్ అధికారులు వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. రాత్రంతా పునరుద్ధరణ పనులు కొనసాగించగా, ఉదయం వరకు ట్రాక్ క్లియరెన్స్ పనులు సాగాయి.
వివరాలు
ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు
పట్టాలు తప్పిన మూడు బోగీలు తీవ్రంగా దెబ్బతినడంతో వాటిని తొలగించేందుకు భారీ క్రేన్లు, యంత్రాలను వినియోగించారు. ప్రభావిత ట్రాక్పై సాధారణ రైలు రాకపోకలను పునరుద్ధరించేందుకు సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సాధారణ నిర్వహణ సమయంలో బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటన అనంతరం అక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకోగా, జీఆర్పీ పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.