LOADING...
TTD Adulterated Ghee: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం.. సంచలనంగా మారిన రిమాండ్‌ రిపోర్టులోని వివరాలు
సంచలనంగా మారిన రిమాండ్‌ రిపోర్టులోని వివరాలు

TTD Adulterated Ghee: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం.. సంచలనంగా మారిన రిమాండ్‌ రిపోర్టులోని వివరాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 31, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. నెయ్యి నాణ్యతపై అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆ సమయంలోని టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి మైసూరు ల్యాబ్‌కు నమూనాలు పంపాలని ఆదేశించారు. ల్యాబ్‌ రిపోర్టులో పామాయిల్‌ కలిసినట్లు తేలినా, ఏ చర్యలు తీసుకోకుండా విషయాన్ని వదిలేశారని తెలిసింది. ఈ ఘటన 2022 జూన్‌లో, అంటే అప్పటి వైసీపీ పాలనలోనే చోటుచేసుకుంది. వైవీ సుబ్బారెడ్డి, పాలకమండలి సభ్యులు, ఉన్నతాధికారులు ఈ అంశాన్ని పక్కనబెట్టారని సిట్‌ విచారణలో తేలింది. ఇదే సమయంలో సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న లంచాలు స్వీకరించినట్టు కూడా ఆధారాలు లభించాయి.

వివరాలు 

ఏపీభవన్‌లో ఓఎస్‌డీగా చిన్న అప్పన్న

ఉత్తర్‌ప్రదేశ్‌ కేంద్రంగా ఉన్న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థ నుండి చిన్నఅప్పన్న రూ.50లక్షల లంచం తీసుకున్నట్లు సిట్‌ నిర్ధారించింది. విజయనగరం జిల్లాకు చెందిన ఆయన, విశాఖ,పరిసర ప్రాంతాల్లో 13ప్లాట్లు,ఒక ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న అప్పన్నను ఢిల్లీ ఏపీభవన్‌లో ఓఎస్‌డీగా నియమించారు. ఐదేళ్ల కాలంలో ఆయన జీతభత్యాలు కలిపి రూ.65 లక్షలే అయినప్పటికీ, బ్యాంక్‌ లావాదేవీలు మాత్రం రూ.4.60కోట్ల వరకు జరిగినట్టు విచారణలో బయటపడింది. బుధవారం రాత్రి సిట్‌ అధికారులు చిన్నఅప్పన్నను అరెస్ట్‌ చేయగా,నెల్లూరు ఏసీబీ కోర్టు నవంబర్‌ 11 వరకు రిమాండ్‌ మంజూరు చేసింది. రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలు ఉన్నాయని తెలిసింది. వారంరోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ సిట్‌ పిటిషన్‌ వేసింది.

వివరాలు 

పీఎస్‌నంటూ డెయిరీల వివరాల సేకరణ 

2022 మే, జూన్‌ నెలల్లో "తితిదే చైర్మన్‌ పీఎస్‌" అంటూ చిన్న అప్పన్న కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యాన్ని సంప్రదించి, తిరుమలకు నెయ్యి సరఫరా చేసే డెయిరీల వివరాలు ఇవ్వమని కోరారు. ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా డెయిరీ నెయ్యి సరఫరా చేస్తున్న సమయంలో, తిరుపతిలోని కమీషన్‌ ఏజెంట్‌ పీపీ శ్రీనివాస్‌ ద్వారా కిలోకు రూ.25 కమీషన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శ్రీనివాస్‌ సూచనతో డెయిరీ డైరెక్టర్‌ పొమిల్‌జైన్‌ను సంప్రదించగా, ఆయన తిరస్కరించారు.

వివరాలు 

ఆరు నెలలకే తనిఖీ చేయాలని ఒత్తిడి 

ఈ పరిణామాల తరువాత చిన్న అప్పన్న, భోలేబాబా డెయిరీపై ఫిర్యాదు చేయించి, తితిదే జీఎం సుబ్రహ్మణ్యానికి దానిపై విచారణ చేయమని చెప్పారు. టెండర్లు పిలిచినప్పుడు సాంకేతిక అర్హత లేదని కారణం చూపించి ఆ డెయిరీని తప్పించాలని యత్నించారు. సాధారణంగా ఏడాదికి ఒకసారి తనిఖీ జరపాలి కానీ, ఆరు నెలలకే పరిశీలన చేయమని ఒత్తిడి చేశారు. దీన్ని గమనించిన పొమిల్‌జైన్‌, వైవీ సుబ్బారెడ్డిని ఢిల్లీలో కలసి సమస్య వివరించారు.

వివరాలు 

ప్రీమియర్‌ అగ్రిఫుడ్స్‌తో మంతనాలు 

ఈ సమయంలో చిన్న అప్పన్న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చారు. ఆ సంస్థ కిలోకు రూ.138 అధిక ధరను కోట్‌ చేసి కాంట్రాక్ట్‌ పొందింది. దీనికి ప్రతిఫలంగా ఆ కంపెనీ చిన్న అప్పన్నకు రూ.50 లక్షలు లంచంగా ఇచ్చినట్లు సిట్‌ తేల్చింది. 2022 జూన్‌లో వైవీ సుబ్బారెడ్డి వివిధ కంపెనీల నుండి వచ్చిన నెయ్యి (భోలేబాబా, శ్రీ వైష్ణవి డెయిరీ, మాల్‌గంగా డెయిరీ మొదలైనవి) పరీక్షలకు పంపించాలని ఆదేశించగా, అన్ని నమూనాల్లోనూ కల్తీ జరిగిందని తేలింది.

వివరాలు 

నాలుగేళ్లలో రూ.250 కోట్ల నెయ్యి సరఫరా 

భోలేబాబా డెయిరీని తితిదే తాత్కాలికంగా నిలిపివేయడంతో, అదే సంస్థ ఇతర పేర్లతో.. శ్రీ వైష్ణవి డెయిరీ, తమిళనాడు దిండిగల్‌లోని ఏఆర్‌ డెయిరీ మొదలైన వాటి ద్వారా.. రూర్కీ (ఉత్తరాఖండ్‌) నుండి కల్తీ నెయ్యి సరఫరా కొనసాగించింది. నాలుగేళ్లలో 68 లక్షల కిలోల నెయ్యి సరఫరా చేసి, దాదాపు రూ.250 కోట్ల విలువైన వ్యాపారం సాగించినట్లు విచారణలో తేలింది. ప్రతి కిలోపై రూ.250 లాభం పొందారని సిట్‌ గుర్తించింది.

వివరాలు 

వైవీ సుబ్బారెడ్డి పాత్రపైనా! 

కల్తీ నెయ్యి వ్యవహారంపై వైవీ సుబ్బారెడ్డికి సమాచారం ఉన్నట్లు సిట్‌ నిర్ధారించింది. ఆయనకు కూడా నగదు లభించిందా? లేక చిన్న అప్పన్న ఆయన ఆదేశాల మేరకే వ్యవహరించారా అనే అంశంపై ఆరాతీస్తోంది. రెండురోజుల సిట్‌ విచారణలో చిన్న అప్పన్న, సుబ్బారెడ్డి గురించి ఏమీ వెల్లడించలేదు. కోర్టు కస్టడీ ఇచ్చిన తర్వాత ఆయన మరిన్ని వివరాలు చెబుతారా అన్నది చూడాలి.