NDMA: నేడు లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్.. అసలు కారణం ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా నేడు (మే 2) లక్షలాది మొబైల్ ఫోన్లలో ఒకేసారి భారీ సైరన్ శబ్దం వినిపించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే దీనిపై ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్త మొబైల్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు ఈ డ్రిల్ నిర్వహిస్తున్నారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT), జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) సంయుక్తంగా ఈ పరీక్ష చేపడుతున్నాయి. అత్యవసర పరిస్థితులు, ప్రకృతి విపత్తులు లేదా ఇతర ప్రమాదాల సమయంలో ప్రజలకు వెంటనే సమాచారం చేరవేయడం ఈ వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వం అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థకు 'సాచెట్' (SACHET - National Disaster Alert Portal)అని పేరు పెట్టారు.
వివరాలు
వ్యవస్థ పనితీరుపై పరిశీలన
ఇప్పటికే ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు పలు మెట్రో నగరాల్లో దీనిని విజయవంతంగా పరీక్షించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మరోసారి ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించనున్నారు. NDMA పంపిన సమాచారం ప్రకారం, మే 2, 2026న మీ ప్రాంతంలో 'ఎమర్జెన్సీ బ్రాడ్కాస్ట్ అలర్ట్' పరీక్ష జరుగుతుంది. మీ మొబైల్కు హెచ్చరిక సందేశం లేదా సైరన్ వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం పరీక్ష మాత్రమే అని అధికారులు తెలిపారు. ఈ అత్యవసర హెచ్చరిక వ్యవస్థ Common Alerting Protocol (CAP) ఆధారంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సూచించిన ఈ సాంకేతికత ప్రస్తుతం దేశంలోని 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లో ఉంది.
వివరాలు
మొబైల్ ఫోన్లకు SMS అలర్ట్లు
ఈ విధానంలో భాగంగా వినియోగదారుల మొబైల్ ఫోన్లకు SMS అలర్ట్లు పంపబడతాయి. అదనంగా పెద్ద సైరన్ శబ్దం వినిపిస్తుంది. సెల్ బ్రాడ్కాస్ట్ టెక్నాలజీ ద్వారా ఒకేసారి వేలాది ఫోన్లకు అలర్ట్ చేరేలా వ్యవస్థ రూపొందించారు. ముఖ్యంగా విపత్తు సంభవించే ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు మాత్రమే హెచ్చరికలు అందేలా దీన్ని రూపొందించారు. ఈ పరీక్ష వెనుక ముఖ్య ఉద్దేశం, భవిష్యత్తులో వరదలు, భూకంపాలు, తుఫానులు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల సమయంలో ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయడం. దీని ద్వారా ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అందుకే మే 2న మీ మొబైల్లో సైరన్ మోగినా లేదా అలర్ట్ మెసేజ్ వచ్చినా భయపడకుండా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.