తెలంగాణ: నేడు మద్యం షాపుల కేటాయింపు; లక్కీ డ్రా ద్వారా ఎంపిక
తెలంగాణలో మద్యం దుకాణాలను సోమవారం కేటాయించనున్నారు. ఎక్సైజ్ శాఖ లక్కీ డ్రా ద్వారా ఈ కేటాయింపులు జరపనున్నది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 2,620మద్యం షాపులకు దరఖాస్తును ఆహ్వానించగా అనూహ్య స్పందన వచ్చింది. రికార్డు స్థాయిలో 1,31,964 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా ప్రక్రియను చేపట్టనున్నట్లు ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా 34ఎక్సైజ్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మద్యం దుకాణాల కేటాయింపు నేపథ్యంలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉండటంతో అన్ని చోట్ల ప్రత్యేకంగా ఫంక్షన్ హాళ్లను బుక్ చేశారు. లక్కీ డ్రా ప్రక్రియ చేపట్టే ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.