రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికార భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై రెజర్లు గత కొంత కాలంగా నిప్పులు చెరిగే నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దిల్లీలో ఆందోళన నిర్వహిస్తూ వెంటనే సదరు ఎంపీని అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ప్లకార్డులు చేతబట్టి డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా రెజర్ల ఆందోళనలో కీలక పరిణామం జరిగింది. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ రైల్వేలో తిరిగి విధుల్లో చేరారు. రెజ్లర్ల బృందం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో భేటీ అయిన రెండురోజుల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం.
అమిత్ షా నుంచి తాము కోరుకున్న స్పందన రాలే : సాక్షి మాలిక్ భర్త
ఒలంపియన్ బజరంగ్ పునియాతో కలిసి భారత టాప్ రెజర్లు శనివారం రాత్రి దేశ రాజధాని దిల్లీలోని అమిత్ షా నివాసంలో రాత్రి 11 గంటలకు భేటీ అయ్యారు. సుమారు గంట పాటు సాగిన ఈ చర్చలో సాక్షి మాలిక్, సంగీత ఫోగట్, సత్యవ్రత్ కడియన్లు షాతో మాట్లాడారు. తీవ్రమైన లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని రెజ్లర్లు కోరారు. స్పందించిన అమిత్ షా, చట్టం ముందు అందరూ సమానులేనని, చట్టం పనిని చేసుకోనివ్వాలని సూచించినట్లు పూనియా చెప్పారు. మరోవైపు ఈ భేటీ గురించి స్పందించిన సాక్షి మాలిక్ భర్త సత్యవ్రత్ కడియన్, అమిత్ షా నుంచి తాము కోరుకున్న స్పందన రాలేదని వివరించారు.
మేమేం వెనక్కి తగ్గలేదు.. తప్పుగా ప్రచారం చేయొద్దు: సాక్షి మాలిక్
ఈ వార్తలపై స్పందించిన సాక్షి మాలిక్ "న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో మేము వెనక్కి తగ్గలేదు. సత్యాగ్రహంతో పాటే రైల్వేలో నా బాధ్యతలను కూడా నిర్వర్తిస్తున్నాను. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు'' అంటూ కోరారు.