Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. మరో నాలుగు రోజులపాటు వర్షాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఆవర్తనానికి అనుసంధానంగా కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణ, గుజరాత్ మీదుగా అరేబియా సముద్రం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం నెలకొనడంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఈ నెల 23 లేదా 24 తేదీల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు మరింత కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
మంగళవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు,పోలవరం,ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అలాగే ఈ నెల 26వ తేదీ వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కొనసాగవచ్చని సూచించింది.
ఇక సోమవారం సాయంత్రం వరకు నమోదైన వర్షపాతం వివరాలను కూడా వాతావరణ శాఖ వెల్లడించింది.
అనకాపల్లి జిల్లా ఎలమంచిలిలో అత్యధికంగా 66.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 36 మిల్లీమీటర్లు,విశాఖ జిల్లా కణమాంలో 35 మిల్లీమీటర్లు, అనకాపల్లి జిల్లా రాంబిల్లి, రామరాయుడుపాలెంలో 33.7 మిల్లీమీటర్లు, విజయనగరంలో 32.5 మిల్లీమీటర్లు, శ్రీకాకుళం జిల్లా లావేరులో 29 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.