
Electricity Charges: విద్యుత్ వినియోగదారులకు రూ.449.60 కోట్ల సర్దుబాటు.. ఏపీఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కంలు
ఈ వార్తాకథనం ఏంటి
గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచడంలో నిత్యం ముందుండగా,తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఛార్జీల తగ్గింపును చేపట్టింది. ఇన్నాళ్లు వినియోగదారులు 'ట్రూఅప్ ఛార్జీలు' అనే మాటను మాత్రమే వింటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత తొలిసారిగా 'ట్రూడౌన్' అనే కొత్త పదం వినిపించబోతోంది. డిస్కంలు తొలిసారి వినియోగదారులకు మొత్తం రూ.449.60 కోట్లను తిరిగి చెల్లించబోతున్నాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో విద్యుత్ కొనుగోళ్లపై డిస్కంలు చేసిన ఖర్చులు, వినియోగదారుల నుంచి వసూలు చేసిన మొత్తం మధ్య తేడాను బట్టి నిర్ణయిస్తారు. ఈ ఇంధన సర్దుబాటు ఛార్జీలను (ఎఫ్పీపీసీఏ) సంబంధిత డిస్కంలు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలికి (ఏపీఈఆర్సీ) సమర్పించాయి.
వివరాలు
ఎఫ్పీపీసీఏ అంటే ఏమిటి?
కమిషన్ వీటిని పరిశీలించి, 90 రోజుల్లోగా తుది ఉత్తర్వులు విడుదల చేస్తుంది. వినియోగదారులకు తిరిగి చెల్లించాల్సిన మొత్తం ఎలా సర్దుబాటు చేయాలన్నదానిపై సూచనలు కూడా ఏపీఈఆర్సీనే ఇస్తుంది. ఇది "ఫ్యుయల్ అండ్ పవర్ పర్చేజ్ కోస్ట్ అడ్జస్ట్మెంట్". అంటే, విద్యుత్ కొనుగోలుకు అయిన అసలైన వ్యయం,వినియోగదారుల నెలనెలా బిల్లుల రూపంలో వసూలు చేసిన మొత్తాల మధ్య తేడాను ఆధారంగా చేసుకుని తుది లెక్కలు వేస్తారు. ఖర్చు వసూలు చేసిన మొత్తానికంటే ఎక్కువైతే .. 'ట్రూఅప్' పేరిట అదనంగా వసూలు చేస్తారు. ఖర్చు తక్కువగా ఉంటే .. అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి చెల్లించాలి.
వివరాలు
ఎఫ్పీపీసీఏ వసూలు విధానం:
రెండు డిస్కంలు కలిసి రూ.842.68 కోట్లను ట్రూఅప్ కింద వసూలు చేసే ప్రతిపాదనలు చేశాయి. ఏపీడీసీఎల్ మాత్రం వ్యయాలు తక్కువగా నమోదుకావడంతో రూ.1,292.28 కోట్లను ట్రూడౌన్ రూపంలో వినియోగదారులకు తిరిగి ఇవ్వాలని ప్రతిపాదించింది. డిస్కంలు ప్రతి యూనిట్ విద్యుత్కు 40 పైసల చొప్పున ఎఫ్పీపీసీఏ పేరిట వినియోగదారుల బిల్లుల్లో వసూలు చేశాయి. మూడు డిస్కంలు కలిపి మొత్తం రూ.2,782.19 కోట్లు వసూలు చేశాయి. క్యారీయింగ్ కాస్ట్ అంటే? ప్రతి నెల విద్యుత్ కొనుగోలుకు చేసిన అదనపు ఖర్చుపై వడ్డీ లెక్కింపు చేస్తారు. దీనినే క్యారీయింగ్ కాస్ట్ అంటారు. దీన్ని కూడా ట్రూడౌన్లో భాగంగా పరిగణనలోకి తీసుకుంటారు.