TSPSC పేపర్ లీక్: పేపర్ అమ్ముకున్న వారు ఎంత మొత్తంలో డబ్బు వసూలు చేసారో వివరించిన సిట్
తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకు కేసులో నగదు లావాదేవీల గురించి కోర్టుకు సిట్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. TSPSC ప్రధాన కార్యదర్శి పీఏ అయిన ప్రవీణ్ కుమార్, ఏఈ సివిల్ ప్రశ్నా పత్రాన్ని 10లక్షల రూపాయలకు అమ్మాడని సిట్ పేర్కొంది. గురుకుల పాఠశాల టీచర్ రేణుకా రాథోడ్, ఆమె భర్త డాక్యా నాయక్ లకు 10లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రాన్ని అమ్మాడు ప్రవీణ్ కుమార్. రేణుకా రాథోడ్, డాక్యా నాయక్ లు, ఆ ప్రశ్నా పత్రాన్ని మరో ఐదుగురికి అమ్మారు. ఆ ఐదుగురిలో ఒక్కొక్కరు కొంత డబ్బు చొప్పున మొత్తం 27.4లక్షలు ఇచ్చారు. ఈ మొత్తంలోంచి 10లక్షలను ప్రవీణ్ కు అందించారు.
చేతులు మారిన 33.4లక్షల నగదు
అలాగే, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ క్వష్షన్ పేపర్ ను ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సాయి సుష్మితలకు 6లక్షలకు అమ్మాడు ప్రవీణ్ కుమార్. ఈ లెక్కన మొత్తంగా ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో 33.4లక్షల నగదు లవాదేవీలు జరిగినట్లు సిట్ తెలియజేసింది. ఇక గ్రూప్ వన్ పేపర్లను కంప్యూటర్ నుండి డౌన్లోడ్ చేసిన రాజశేఖర్ రెడ్డి, వాటిని డబ్బులకు అమ్ముకోలేదనీ, న్యూజిలాండ్ లో నివాసముంటున్న తన బావా సానా ప్రశంత్, TSPSCలో ASO గా పనిచేసిన షమీమ్ కు ఫ్రీగా ఇచ్చాడని సిట్ తెలిపింది. అయితే ప్రవీణ్ కుమార్ బ్యాంకు ఖాతాలను సిట్ అధికారులు ఫ్రీజ్ చేసారు.