TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. దాతల ప్రివిలేజెస్లో భారీ మార్పులు
ఈ వార్తాకథనం ఏంటి
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రత్యేక సదుపాయాల్లో(ప్రివిలేజెస్)పలు మార్పులు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం ఈవో ఎం. రవిచంద్రతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. విరాళాల నిర్వహణలో మరింత పారదర్శకత, ఏకరీతి తీసుకురావాలనే ఉద్దేశంతో టీటీడీకి చెందిన అన్ని ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు వర్తించే ప్రివిలేజెస్ను పునర్వ్యవస్థీకరించినట్లు ఛైర్మన్ తెలిపారు. కొత్త నిబంధనలు ఈరోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే వివిధ ట్రస్టులు,పథకాలకు విరాళాలు అందించిన దాతలకు ప్రస్తుతం అమల్లో ఉన్న సదుపాయాలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
వివరాలు
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు
రూ.6.31 కోట్ల వ్యయంతో తిరుమలలో ఎస్ఎస్డీ టోకెన్లు పొందిన భక్తులు వేచి ఉండేందుకు ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు నిర్మించేందుకు టెండర్లకు ఆమోదం తెలిపింది.
కుమారధార, పసుపుధార డ్యామ్ల భద్రతను మరింత బలోపేతం చేసేలా డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ.2.77 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తిరుమలలో గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జీఎన్సీ సమీపంలో 800 కిలోవాట్ల సామర్థ్యంతో విండ్ టర్బైన్ జనరేటర్ను విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ విరాళంగా ఏర్పాటు చేసి, టీటీడీకి 25 సంవత్సరాల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం తెలిపింది.
వివరాలు
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు
తిరుమల ఎస్వీ మ్యూజియంలో 12 సంవత్సరాలు దాటిన సందర్శకులకు జీఎస్టీతో కలిపి రూ.50 ప్రవేశ రుసుము నిర్ణయించింది. మ్యూజియం నిర్వహణ బాధ్యతలను టాటా సంస్థకు అప్పగించే అంశంపై ఆ సంస్థను సంప్రదించాలని నిర్ణయించింది.
కాకులమానుతిప్ప ప్రాంతంలో 25 సంవత్సరాలకు పైగా పేరుకుపోయిన ఘన వ్యర్థాలను బయో-రిమీడియేషన్, బయో-మైనింగ్ విధానాల ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి రూ.5 కోట్ల వ్యయానికి ఆమోదం తెలిపింది.
భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ తిరుమల, తిరుపతిలోని టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థల సమగ్ర నిర్వహణ కోసం రూ.2.35 కోట్లతో నిర్వహణ పనులను కొనసాగించాలని నిర్ణయించింది.
వివరాలు
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు
తిరుమలలోని టీబీసీ, ఏటీసీ విశ్రాంతి భవనాల సమీపంలో ఉన్న 12 పాత భవనాలను తొలగించి, వాటి స్థానంలో దాతల సహకారంతో కొత్త భవనాలు నిర్మించేందుకు ఆమోదం తెలిపింది.
2027 సంవత్సరానికి సంబంధించిన శ్రీ వేంకటేశ్వరస్వామి క్యాలెండర్లు, డైరీల ముద్రణకు అనుమతి ఇచ్చింది. ఇందులో 10 లక్షల డైరీలు, 13.50 లక్షల 12 పేజీల క్యాలెండర్లు, 75 వేల 6 పేజీల క్యాలెండర్లు ముద్రించనున్నారు.
తిరుమల ఆక్టోపస్ బేస్ క్యాంప్లో అదనపు మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు ఎఫ్ఎంఎస్ సేవల కోసం రూ.2.91 కోట్లను మంజూరు చేసింది.
ఒంటిమిట్ట శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామి మూలవిరాట్టులకు బంగారు కవచాల తయారీ కోసం టీటీడీ ట్రెజరీలోని వెయ్యి గ్రాముల బంగారాన్ని వినియోగించేందుకు ఆమోదం తెలిపింది.
వివరాలు
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు
రూ.17.84 కోట్ల వ్యయంతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం వద్ద యాత్రికుల కోసం 100 గదులతో విశ్రాంతి గృహం నిర్మించేందుకు టెండర్లను ఆమోదించింది.
ఒంటిమిట్ట ఆలయం ఈశాన్య మాడవీధి విస్తరణ, యాత్రికుల సౌకర్యాల మెరుగుదల కోసం 6,103 చదరపు అడుగుల భూమి సేకరణ నిమిత్తం జిల్లా యంత్రాంగానికి రూ.2.11 కోట్ల చెల్లింపునకు ఆమోదం తెలిపింది.
తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారి ఆలయంలో ముఖ మండపంపై సాలహారం నిర్మాణంతో పాటు మిగిలిన ప్రాకార గోడ నిర్మాణానికి రూ.2.50 కోట్ల టెండర్కు ఆమోదం లభించింది.
వివరాలు
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు
టీటీడీలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల పారాయణం నిరంతరాయంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో నిత్య వేదపారాయణం నిర్వహించేందుకు వేద పారాయణ పథకం కింద 791 మంది సంభావన వేద పండితులను నియమించనుంది.
హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారుల పారితోషికాన్ని వారి ప్రతిభ, అనుభవాన్ని ఆధారంగా పెంచేందుకు బోర్డు ఆమోదం తెలిపింది.
టీటీడీ క్యాంటీన్ల విభాగంలో పనిచేస్తున్న 65 సర్వర్ పోస్టులను క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని బోర్డు నిర్ణయించింది.